నేతలతో జగన్, వెంకట్రావ్ టీడీపీవైపు చూస్తున్నారా?
హైదరాబాద్: గ్రేటర్ విశాఖ ఎన్నికలకు సిద్ధం కావాలని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేయాలని, అందుకు కమిటీల నియామకం చేపట్టాలన్నారు.
హైదరాబాదులోని లోటస్ పాండులో జిల్లాలో పార్టీ కన్వీనర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జగన్ ఒక్కరొక్కరితో ఐదు పది నిమిషాలు మాట్లాడారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. సమీక్ష సమావేశం అనంతరం విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా డిసెంబర్ 5వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వైయస్ జగన్ పాల్గొంటారని తెలిపారు. కాగా, జిల్లాలో పార్టీ కన్వీనర్లతో పాటు సీనియర్ నాయకులను కలుపుకుపోవాలని పలువురు జగన్కు సూచించినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా, పార్టీ సమీక్ష సమావేశానికి పెందుర్తి ఇంచార్జి వెంకట్రావు గైర్హాజరయ్యారు. పెందుర్తి ఇంచార్జిగా ఇటీవలి వరకు గండి బాబ్జి ఉన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయనను తొలగించి. వెంకట్రావును నియమించారు. ఈ నియామక వివాదమై.. చివరకు కొణతాల రామకృష్ణ పార్టీ వీడిన విషయం తెలిసిందే. తాజాగా వెంకట్రావు కూడా మంత్రి, టీడీపీ నేత గంటా వెంకట్రావుతో సమావేశమైనట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇతడు కూడా పార్టీని వీడుతారా అనే చర్చ సాగుతోంది.
పార్టీ బలోపేతానికి కృషి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని గ్రామీణ స్థాయి నుంచి బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త నిర్విరామంగా కృషి చేయాలని ఆ పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ పిలుపునిచ్చారు.
స్థానిక పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ నాయకులు విభేదాలు, బేషజాలు విడనాడి పార్టీ అభివృద్ధికి శ్రమించాలన్నారు. ఎస్సీ, బిసి, మైనార్టీ వర్గాలను కలుపుకోవాల్సి ఉందని సూచించారు. పార్టీ అధ్యక్షుడు జగన్ ఆశయాల మేరకు ఉద్యమాల ద్వారా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.