మా భయాలు చెప్పాం, మోడీ శ్రద్ధగా విన్నారు: జగన్
న్యూఢిల్లీ: ప్రాజెక్టుల అమలులో తమ భయాలను తాము ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకు వెళ్లామని, తాము ప్రస్తావించిన అంశాలని ప్రధాని శ్రద్ధగా విన్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం అన్నారు.
పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టుల పైన ప్రధానితో చర్చించామని చెప్పారు. ప్రాజెక్టుల అమలులో తమ భయాలు వెల్లడించామన్నారు. స్టోరేజీకి అవకాశం లేకుండా పట్టిసీమ ప్రాజెక్టు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం సకాలంలో పూర్తి చేయాలని తాము ప్రధానిని కోరామని చెప్పారు.
ప్రధాని సమస్యలను పరిష్కరిస్తారని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు. కాగా, ప్రధాని నరేంద్ర మోడీతో జగన్తో పాటు పలువురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు ప్రధానితో పలు అంశాలపై చర్చించారు.
నూతన ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం సాయం చేయాలని, విభజన చట్టంలోని హామీలను కేంద్రం అమలు చేయాలని జగన్ ప్రధానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి నిధులు, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై సాయం చేయాల్సిందిగా జగన్ ప్రధానిని కోరారు.