జగన్ మమ్మల్ని అడగలేదు, అప్పుడు అలా చేశారు: రఘువీరా
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తలపెట్టిన బంద్కు సహకరించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తమను కోరలేదని ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షుడు ఎన్ రఘువీరా రెడ్డి చెప్పారు. పైగా గతంలో తాము బంద్ చేసినపుడు సహకరించకపోగా ఢిల్లీ ధర్నాలో జగన్ తమపైనే విమర్శలు చేశారని ఆయన ఆరోపించారు.
ప్రత్యేక హోదా సాధనలో అధికారపక్షంతోపాటు ప్రతిపక్షం విఫలమైందని ఆయన శనివారంనాడు మీడియాతో అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపక్షంగా ఉండటం దురదృష్టకరమన్నారు. బీజేపీ, టీడీపీ చిలుకపలుకులు మాని ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన డిమాండు చేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. భిమిలీ నియోజకవర్గం సమన్వయకర్త చెన్నాదాస్ నివాసంలో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు.
రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పార్టీ పోరాడుతుందని ఆయన చెప్పారు. రాష్ట్రంంలో పార్టీ అభివృద్ధికి గ్రామస్థాయి నుంచి కమిటీలు వేసి కార్యకర్తల సూచనల మేరకు ముందుకు సాగుతామని చెప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో మోసం చేసిన ప్రదాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబులపై రాష్ట్రంలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్లలో కేసులు పెడుతామని రఘువీరా చెప్పారు.
ఈ సమావేశంలో మాజీ మంత్రులు వట్టి వసంతకుమార్, బాలరాజు, మాజీ శాసనసభ్యుడు శ్రీనివాస్, కాంగ్రెసు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.