సిఎం అని చెప్పడానికి సిగ్గుగా ఉంది: బాబుపై జగన్
విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్ తీవ్రంగా ధ్వజమెత్తారు. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అని చెప్పడానికి సిగ్గుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నోటి వెంట ఒక మాటొస్తే ఆ మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం, భరోసా ప్రజలకు ఇవ్వలేని వ్యక్తి సీఎం స్థానంలో ఎందుకు కూర్చోవాలని ఆయన అడిగారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమ లుచేయకుండా రైతన్నలను, డ్వాక్రా అక్కచెల్లెమ్మలను, కాంట్రాక్టు ఉద్యోగ సోదరులను, అవ్వా తాతలు అందర్నీ మోసం చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబే అని, ఇటువంటి వ్యక్తి సీఎం అని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబును గట్టిగా నిలదీస్తామని, అప్పటికీ ఆ మనిషికి సిగ్గురాకపోతే ప్రజలకు అండగా తాను ఉంటానని, ప్రజల తరఫున తరపున పోరాడుతానని ఆయన చెప్పారు. మరో నాలుగున్నరేళ్లలో మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు అందరి సమస్యలు పరిష్కరిస్తానని ఆయన అన్నారు. గుంటూరు మాజీ ఎంపీపీ, జెడ్పీ ఫ్లోర్లీడర్ రాతంశెట్టి సీతారామాంజనేయులు (లాలుపురం రాము) పెద్ద కుమారుడు రాజమన్నార్ వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆయన మంగళవారం గుంటూరు వచ్చారు.
గన్నవరం ఎయిర్పోర్టు నుంచి గుంటూరు వరకు రోడ్డు మార్గంలో వెళ్లిన జగన్ను దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు జగన్ను కలిసి తమ సమస్యలను వినిపించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలన్న డిమాండ్పై సమ్మెకు దిగిన విద్యుత్ కాంట్రాక్టు కార్మికులు విజయవాడ జింఖానా గ్రౌండ్లో చేపట్టిన ధర్నాలో పాల్గొని వారికి మద్దతు ప్రకటించారు. ఈ అంశంపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తామని చెప్పారు. రైతుల పట్ల చంద్రబాబు ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, అసెంబ్లీలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని జగన్మోహన్రెడ్డి వారికి హామీ ఇచ్చారు.
జగన్వెంట ఎమ్మెల్యేలు కొడాలి వెంకటేశ్వరరావు(నాని), ఆళ్ల రామకృష్ణారెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఉప్పులేటి కల్పన, కొక్కిలిగడ్డ రక్షణనిధి, జలీల్ ఖాన్, మహ్మద్ ముస్తాఫా, పార్టీరాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, తలశిల రఘురామ్, కృష్ణా, గుంటూరు జిల్లాల అధ్యక్షులు కొలుసు పార్ధసారధి, మర్రి రాజశేఖర్, గుంటూ రు నగర అధ్యక్షులు లేళ్ళ అప్పిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్, రాష్ట్ర ట్రేడ్ యూనియన్ అధ్యక్షులు పి. గౌతమ్రెడ్డి, ఎస్సీ విభాగం రాష్ర్ట అధ్యక్షులు మేరుగ నాగర్జున, వైద్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ఉన్నారు.