ప్రతిష్టాత్మకంగా తీసుకోండి: జగన్, రామ్నాథ్తో విజయసాయి భేటీ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతలకు సూచించారు. ఆయన నివాసంలో పార్టీ కీలక నేతలతో సమావేశమై ప్లీనరీ ఏర్పాట్లపై సమీక్షించారు.
గుంటూరు-విజయవాడ మధ్య గల ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదరుగా ఎంపిక చేసిన స్థలంలో జులై 8,9 తేదీల్లో ప్లీనరీ సమావేశాలు జరగాలని ఇప్పటికే నిర్ణయించారు. కాగా, ఇప్పటికే ముగిసిన నియోజకవర్గాల ప్లీనరీలు బాగా జరిగాయని జగన్ ఈ సందర్బంగా సంతృప్తి వ్యక్తం చేశారు.
నిర్మాణాత్మకంగా పార్టీ పటిష్టతకు ఈ సమావేశాలు ఎంతో ఉపయోగపడ్డాయని కూడా జగన్ అన్నారు. జిల్లా ప్లీనరీలను కూడా ఇదే ఉత్సాహంతో పూర్తవుతాయని పలువురు నేతలు ఈ సందర్భంగా తెలిపారు. రాజధాని ప్రాంతంలో రాష్ట్రస్థాయి ప్లీనరీ జరుగుతోందని, కనుక దాని ప్రభావం గుంటూరు, కృష్ణా జిల్లాలపై బాగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
టీడీపీ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి రెండేళ్లలో వచ్చే ఎన్నికలకు సిద్ధంగా కావాలని, ఇందుకు ప్లీనరీనే వేదికగా చేసుకోవాలని అన్నారు. మరోసారి జూన్ 23వ తేదీన ప్లీనరీ ఏర్పాట్లపై చర్చించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, పార్థసారథి, భూమన కరుణాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని కలిసిన విజయసాయి
ఎన్డీఏ ప్రభుత్వం తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించిన రామ్నాథ్ కోవిందేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటుసభ్యుడు విజయసాయిరెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్ప గుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. కాగా, ఇప్పటికే ఎన్డీఏ అభ్యర్థికే తమ మద్దతు ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.