'అసెంబ్లీ ప్రారంభం కాగానే.. ఓ సీఎంకు సుప్రీం నోటీసులు పెద్ద విషయమే'
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన సోమవారం నాడు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఓ ముఖ్యమంత్రికి సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వడం చాలా పెద్ద విషయమని చెప్పారు. సీఎం పదవిలో ఉన్న వ్యక్తులు ఆడియో, వీడియోలతో సహా దేశంలో ఎక్కడా దొరకలేదని వ్యాఖ్యానించారు. కానీ చంద్రబాబు అడ్డంగా దొరికాడన్నారు.
విభజనపై మళ్లీ బాబు, లోకేష్కు బెస్టఫ్ లక్, సుప్రీంకు ఓటుకు నోటు కేసుపై..
అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగుతున్నారని విమర్శించారు. 'మన వాళ్లు బ్రీఫ్డ్ మీ' అన్న వాయిస్ తనది కాదని చంద్రబాబు ఇప్పటికీ చెప్పలేదని జగన్ గుర్తు చేశారు. ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు చాలా కష్టపడ్డారని ఎద్దేవా చేశారు.
అరగంటలోనే చంద్రబాబు ప్రెస్ మీట్
ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం కాగానే అరగంటలోనే మళ్లీ చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి గవర్నర్ చెప్పిన విషయాన్ని మళ్లీ చెప్పారని జగన్ విమర్శించారు. మీడియాలో ఎక్కడ ఓటుకు కోట్లు విషయం వస్తుందోననే భయంతో చంద్రబాబు ఆ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు చాలా కష్టపడ్డారన్నారు.
అసెంబ్లీ ప్రారంభం.. సుప్రీం విచారణ
సరిగ్గా గం.11.06 నిమిషాలకు గవర్నర్ ప్రసంగం ప్రారంభమైతే, 11.10 నిమిషాలకు చంద్రబాబు కేసును సుప్రీం కోర్టు విచారణకు చేపట్టిందన్నారు. కేసును అడ్మిట్ చేసుకొని నోటీసులు ఇచ్చిందని చెప్పారు.
మామూలే అన్న చంద్రబాబు
చంద్రబాబు మాత్రం అవన్నీ మూమూలే అంటున్నారన్నారు. పైగా తన పైన 26 కేసులు పెట్టారని, అవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించడం సిగ్గుచేటు అన్నారు. ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
అమరావతి రైతులకు అన్యాయం
రాజధాని రైతులకు ప్లాట్ల కేటాయింపులో అన్యాయం జరిగిందని జగన్ చెప్పారు. అభివృద్ధి అంటే వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు కూడా అభివృద్ధి చెందాలన్నారు. ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వారి బంధువులకు మంచి ప్లాట్లు కేటాయిస్తున్నారన్నరు. గవర్నర్ ప్రసంగంపై రేపు సుదీర్ఘంగా మాట్లాడుతానని చెప్పారు.
ఆళ్ల రామకృష్ణా రెడ్డి
కాగా, ఓటుకు నోటు కేసులో ఏపీ సీఎం చంద్రబాబును ప్రాసిక్యూషన్ చేసేలా ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. ఈ కేసులో చంద్రబాబును ప్రాసిక్యూట్ చేయాలా.. వద్దా అన్న అంశంపై పూర్తిస్థాయిలో వాదనలు వింటామని జస్టిస్ బూబ్డే, జస్టిస్ లావు నాగేశ్వరరావులతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ పిటిషన్ను వైసిపి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి దాఖలు చేశారు. గతంలో ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టివేయగా.. దాన్ని సవాల్ చేస్తూ రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.