బాబులా మోసం చేయను: ‘నంద్యాల’కు మాటిచ్చిన జగన్
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబులా తాను మోసం చేయనని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాలలో మూడేళ్ల క్రితం జరిగిన ఆగస్టు 15 వేడుకల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని అన్నారు.
నంద్యాల: టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడులా తాను మోసం చేయనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. నంద్యాలలో మూడేళ్ల క్రితం జరిగిన ఆగస్టు 15 వేడుకల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు ఇప్పటికీ నెరవేర్చలేదని అన్నారు.
అప్పుడే సీఎం అయ్యేవాడిని..
గత ఎన్నికల్లో ఒక్క అబద్ధం చెప్పివుంటే ఇప్పుడు తానే ముఖ్యమంత్రినని జగన్ తెలిపారు. నంద్యాల చుట్టుపక్కల నియోజకవర్గాల్లో అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు. నంద్యాల మండలం రైతునగరంలో వైయస్ జగన్ ఆధ్వర్యంలో బుధవారం రోడ్ షో జరిగింది.
Recommended Video
బాబు వచ్చే వారేనా?
నంద్యాల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి శిల్పామోహన్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా జగన్ కోరారు. నంద్యాల ఉపఎన్నికలు జరగకపోతే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రాంతంలో అడుగు కూడా పెట్టకపోయేవారని జగన్ అన్నారు. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే నంద్యాల అభివృద్ధి అంటూ ఇప్పుడు ఇక్కడికి వస్తున్నారని అన్నారు.
వెన్నుపోటు పొడిచారు..
నంద్యాలలో న్యాయానికి, అన్యాయానికి మధ్య యుద్ధం జరుగుతోందని ఆయన అన్నారు. ఎన్నికలప్పుడు ఎన్నో హామీలిచ్చిన చంద్రబాబు.. ఆ తర్వాత రైతులకు వెన్నుపోటు పొడిచాడని అన్నారు. జాబు కావాలంటే బాబు రావాలని ప్రచారం చేసుకున్న చంద్రబాబు.. రాష్ట్రంలోని యువతకు ఉద్యోగాలు కల్పించలేదని అన్నారు.
నంద్యాలకు జగన్ హామి..
చంద్రబాబునాయుడికి ఓ శాపం ఉందని, నిజాలు చెబితే ఆయన తల వెయ్యి ముక్కలు అవుతుందని జగన్ అన్నారు. తాను మాత్రం ఎప్పుడూ అబద్ధాలు చెప్పబోనని స్పష్టం చేశారు. ప్రజలు ధర్మం, న్యాయం వైపు నిలబడాలని జగన్ పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాలను జిల్లాగా ప్రకటిస్తామని జగన్ హామీ ఇచ్చారు.