జగన్ దీక్షలు ఫ్యాషన్ షోలు, బాబు చేతులు దులుపుకున్నారు: కారెం
గుంటూరు/ విశాఖపట్నం: వివిధ పేర్లతో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్ చేస్తున్న దీక్షలు ఫ్యాషన్ షోలను తలపిస్తున్నాయని మాల మహానా డు జాతీయ అధ్యక్షుడు కారెం శివాజీ విమర్శించారు. గుంటూరులో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ ప్రజల్లోకి వెళ్లి ఆపరేషన్ సీఎంగా వ్యవహరిస్తున్నారన్నారని విమర్శించారు.
తాను అధికారంలోకి వస్తే రాజధాని భూములను తిరిగి ఇచ్చేస్తానంటూ రైతులను మభ్య పెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు .ప్రత్యేకహోదాపై రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రజల్ని మభ్యపెడుతున్నాయన్నారు. అసెంబ్లీలో హోదాపై తీర్మానం చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతులు దులుపుకుంటున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ రీచార్జ్ కోసం ప్రత్యేక హోదాను వాడుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదాను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకుంటే రాజకీయ పార్టీలకు ప్రజల్లో పుట్టగతులుండవన్నారు. హోదా సాధించే వరకు ఉద్యమాన్ని ఉధృ తం చేస్తామన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల జోలికి వస్తే దేశం విచ్ఛిన్నమవటం ఖాయమని హెచ్చరించారు.
ఏపీకి ప్రత్యేకహోదా కోసం నిరశన దీక్ష చేపడతానని వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు జగన్ చెప్పడం పెద్దజోక్ అని మంత్రి రఘునాథరెడ్డి అన్నారు. శుక్రవారం సబ్బవరం మండలం గుల్లేపల్లిలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం బాగు గురించి ఏనాడూ ఆలోచించని ఆయన ప్రత్యేకహోదా కోసం దీక్షకు పూనుకోవడం విడ్డూరంగా వుందన్నారు.