బంద్ సక్సెస్, ఆంధ్రజ్యోతి నుంచి వచ్చావని అర్థమైంది: జగన్
హైదరాబాద్: ప్రత్యేక హోదాను డిమాండ్ చేస్తూ తాము చేసిన బంద్ విజయవంతమైందని, ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వైఖరి అర్థమైందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ పోరాటం ఆగదని, మరింత ఉధృతం చేస్తామని ఆయన శనివారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. బంద్ను విజయవంతం చేసినందుకు ఆయన ప్రజలకు, వామపక్షాలకు, ప్రజా సంఘాలకు ధన్యవాదాలు తెలిపారు.
ఇప్పటికైనా చంద్రబాబు నాయుడికి జ్ఞానోదయం కలగాలని, కేంద్రంపై ఒత్తిడి తేవాలని, అందుకు తాము సహకరిస్తామని ఆయన చెప్పారు. శాసనసభలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని ఆయన చెప్పారు. అసలు ప్రభుత్వం ప్రత్యేక హోదాకు అనుకూలమా, వ్యతిరేకమా అనేది స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై పోరాటం చేయకపోతే చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు.
ఓ మీడియా ప్రతినిధి వేసిన ప్రశ్నకు జగన్ ఆసక్తికరంగా స్పందించారు. "నువ్వు ఆంధ్రజ్యోతి నుంచి వచ్చావని అర్థమైందబ్బా, రాజకీయం చేయవద్దు" అని జగన్ అన్నారు. ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ పేరును కూడా ఆయన ప్రస్తావించారు. బంద్ను విఫలం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనను రద్దు చేసుకుని, విజయవాడలో మంత్రివర్గ సమావేశం పెట్టి, జిల్లాలవారీగా సమీక్షిస్తూ ప్రయత్నాలు చేశారని ఆయన అన్నారు.
40 మంది ఎమ్మెల్యేల అరెస్టు
బంద్ను విఫలం చేయడానికి 40 మంది శాసనసభ్యులను అరెస్టు చేశారని, వేలాది మంది కార్యకర్తలను అరెస్టు చేశారని, మహిళలను సైతం చితకబాదారని ఆయన విమర్శించారు. ప్రత్యేక హోదా కన్నా ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని అంటున్నారని, ప్రత్యేక ప్యాకేజీ మన హక్కు అని ఆయన అన్నారు. చట్టంలో పెట్టినవన్నీ ప్రత్యేక ప్యాకేజీలో ఉంటాయని, కొత్తగా కేంద్రం ఇచ్చేవి కావని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వల్ల 90 శాతం గ్రాంట్స్ వస్తాయని, ప్రత్యేక హోదా లేకపోతే 30 శాంతం గ్రాంట్స్ మాత్రమే వస్తాయని ఆయన చెప్పారు.
ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి, ఇప్పుడు అడ్డుపడుతున్నాయంటూ కొన్ని రాష్ట్రాల పేర్లు చెబుతున్నారని, ఆ రాష్ట్రాలు అడ్డు చెప్పే విషయం ఎన్నికలకు ముందు తెలియదా అని ఆయన అన్నారు. 14వ ఆర్తిక సంఘం ప్రత్యేక హోదా ఇవ్వకూడదని గానీ, ప్రత్యేక హోదా రాష్ట్రాలకూ ప్రత్యేక హోదా లేని రాష్ట్రాలకు మధ్య తేడాను కూడా చూడదని ఆయన అన్నారు. చదువుకున్నారు కదా ఆ విషయం తెలియదా అని ఆయన అడిగారు.
పార్లమెంటులో ఇచ్చిన హామీ కూడా అమలువుతుందనే నమ్మకం లేకపోతే అన్యాయం కాదా అని ఆయన అడిగారు. ప్రత్యేక హోదా వస్తేనే మంచి జరుగుతుందని, పరిశ్రమలు వస్తాయని ఆయన చెప్పారు. ప్రత్యేక హోదాకు ప్రధాని పార్లమెంటులో హామీ ఇచ్చాయని, బిజెపి టీడీపిలు దానికి మద్దతు పలికాయని ఆయన గుర్తు చేశారు. పార్లమెంటులో ఇచ్చిన హామీకి కూడా విశ్వసనీయత లేకపోవడం అన్యాయమేనని ఆయన అన్నారు.