రేపు చాలా మాట్లాడుతా, బాబు కిరికిరి కమిటీ: జగన్
తణుకు: దీక్ష ముగింపు సందర్భంగా రేపు (ఆదివారం) సుదీర్ఘంగా మాట్లాడుతానని, ఈ నిరాహార దీక్ష చేయడానికి కారణం ఏమిటో అందరికీ తెలుసునని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రైతు దీక్ష ప్రారంభోపన్యాసంలో ఆయన ఈ విధంగా అన్నారు. ఆయన క్లుప్తంగా మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులను, డ్వాక్రా అక్కచెల్లెళ్లను మోసం చేశారని విమర్శించారు.
రాష్ట్రవ్యాప్తంగా మోసపోతున్న రైతులకు, డ్వాక్రా అక్కాచెల్లెళ్లకు అండగా నిలబడేందుకు ఈ దీక్ష చేస్తున్నట్లు తెలిపారు. ఇంతకు ముందు మండల, జిల్లా కేంద్రాల్లో ముట్టడి కార్యక్రమాలు నిర్వహించామని, దాని కొసనాగింపుగా ఇప్పుడు తుణుకు రైతు దీక్ష చేపట్టామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ దీక్ష చేస్తున్నట్లు చెప్పారు.
పనులను వదులుకుని, ఎండను సైతం లెక్క చేయకుండా, కష్టమైనా ఓర్చి రైతుల కోసం, డ్వాక్రా అక్కాచెల్లెళ్ల కోసం జరుగుతున్న ఈ దీక్షకు వేల సంఖ్యలో సంఘీభావం తెలిపేందుకు వచ్చారని, వారి ఆప్యాయతకు చేతులు జోడించి, శిరసు వంచి పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నానని జగన్ అన్నారు. రుణమాఫీపై చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, కిరిరికి కోటయ్య కమిటీ వేశారని ఆయన అన్నారు.
మనకు సమర్థుడైన నాయకుడు దొరికాడని అంతకు ముందు ప్రసంగించిన పార్టీ నాయకుడు ధర్మాన ప్రసాద రావు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ప్రజాశక్తితో చంద్రబాబును నిలదీద్దామని ఆయన అన్నారు. జగన్ ప్రసంగం ముగిసిన తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు ఒక్కరొక్కరే దీక్ష శిబిరం వేదిక మీంచి మాట్లాడుతూ వెళ్లారు.