నేను మారాలా చెప్పండి?: సీనియర్లకు జగన్ షాక్!, మండిపడిన రోజా
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డిలో ఆత్మ పరిశీలన ప్రారంభమైందా? అంటే అవునంటున్నారు. గురువారం నాడు జగన్ పార్టీ నేతలతో చేసిన వ్యాఖ్యలు పలువురిని ఆశ్చర్యానికి గురి చేశాయని తెలుస్తోంది.
జగన్ అన్నీ తానై చూస్తారని, సీనియర్ల మాటలు పట్టించుకోరని పలు ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే. అయితే గురువారం మాత్రం పార్టీ సీనియర్లకు పలు ప్రశ్నలు ఆయన సంధించారట.
నేను ఏమైనా మారాల్సి ఉందా? నా పంథాను మార్చుకోవాలా? నాలో ఏమైనా లోపాలున్నాయా? అని అడిగినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్లు కొన్ని సూచనలు చేశారని సమాచారం.
వైయస్ ఫోటో తొలగింపుపై అసెంబ్లీలో ఎమ్మెల్యేల ధర్నా
ఆంధ్రప్రదేశ్ శాసన సభ లాంజ్లో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని తొలగించడంపై వైసిపి ఎమ్మెల్యేలు శుక్రవారం నాడు అసెంబ్లీ కార్యదర్శి చాంబరు వద్ద ఆందోళనకు దిగారు. వైయస్ ఫోటోను తిరిగి అక్కడే పెట్టాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ... వైయస్ ఫోటో తీసివేయడం సరికాదన్నారు. ఫోటో తీసిన చోటనే పెట్టకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. బాలయోగి ఫోటోను కూడా పార్లమెంటులో పెట్టారని చెప్పారు. స్పీకర్ పక్షపాత వైఖరి సరికాదన్నారు.
రెండు రోజుల్లో వైయస్ ఫోటోను యథాస్థానంలో ఏర్పాటు చేయాలన్నారు. అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఓటుకు నోటు, పుష్కరాల ఘటనను పక్కదారి పట్టించేందుకు ఇలా చేస్తున్నారని ఆరోపించారు.
అసెంబ్లీ కార్యదర్శితో మాట్లాడిన సభాపతి
ఫోటో తొలగింపుపై అసెంబ్లీ కార్యదర్శితో సభాపతి కోడెల శివప్రసాద్ రావు ఫోన్లో మాట్లాడారు. వైసీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన వినతి పత్రం తీసుకొని, సంప్రదాయాల ప్రకారం నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.