'తెలుగు జాతి గౌరవం ఢిల్లీలో తాకట్టు, ఆ దమ్ముందా?, రాజీనామాకు సిద్దమన్న జగన్ '
ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గుంటూరు జిల్లాలో జరిగిన యువ భేరి సదస్సులో ఆయన ప్రసంగించారు.
గుంటూరు:వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై నిప్పులు చెరిగారు. అభివృద్ది చెందిన నగరాలతో మనం ఎలా పోటీపడగలమని ఆయన ప్రశ్నించారు. తెలుగుజాతి కోసం పోరాటం చేయాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుజాతికే వెన్నుపోటు పొడిచాడని ఆయన విమర్శించారు. తెలుగు జాతి గురించి చంద్రబాబు కూడ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
గుంటూరు సమీపంలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో గురువారం నాడు యువ భేరి సభను నిర్వహించారు . ఈ సభలో వైఎస్ఆర్ సి పి అధినేత జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై జగన్ నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదా కోసం వచ్చిన యువతకు జగన్ ధన్యవాదాలు తెలిపారు.
ప్రత్యేక హోదా కోసం మనమంతా ఇక్కడ సమావేశమయ్యామంటూ జగన్ యువ భేరి సభలో పాల్గొన్న యువతను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
రాష్ట్రం కోసం త్యాగం చేస్తే అమరవీరులు
ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో నల్లపాడు లో యువభేరి సభను నిర్వహించారు. ఈ సభలో ఆయన యువతను ఉద్దేశించి ప్రసంగించారు. దేశం కోసం త్యాగాలుచేసిన వారిని స్వాతంత్ర్య సమరయోధులు అంటారు. రాష్ట్రం కోసం త్యాగాలు చేసే వారిని అమరవీరులంటారని చెప్పారు.స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి దేశంలో అనేక మార్పులు చోటుచేసుకొన్నాయని ఆయన చెప్పారు. అప్పటితో పోలిస్తే మన ఆదాయాలు మారాయి, మన ఆహారధాన్యాల ఉత్పత్తి మారిందని ఆయన గుర్తు చేశారు.దేశ వ్యాప్తంగా అనేక మార్పులు వచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
అభివృద్దిని కోరుకోవాలి
ఏ దేశమైనా, రాష్ట్రమైనా, గ్రామమైనా అభివృద్దిని కోరుకొంటుందని వైఎస్ జగన్ చెప్పారు. మొన్నటి కంటే నిన్న, నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు కూడ బాగుండాలని ఆయన కోరుకొన్నారు.ఇంతకుముందు సాధించిన అభివృద్దిని నిలబెట్టుకొంటూ మరింత ప్రగతి సాధించడం దాని అర్థమన్నారు.
ప్రభుత్వం బాగుంటే అభివృద్ది కూడ ఉంటుంది
ప్రభుత్వం బాగుంటే పురోగతి బాగా కన్పిస్తోంది. ప్రభుత్వం సక్రమంగా పనిచేయలేకపోతే వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంటుందన్నారు వైఎస్ జగన్. హైద్రాబాద్, చెన్నై, బెంగుళూరు అన్నీ నగరాలు ఈ 70 ఏళ్లలో ప్రభుత్వాలు అందించిన తోడ్పాడుతో అభివృద్ది చెందిన నగరాల జాబితాలో ఉన్నాయని చెప్పారు.ఈ నగరాలతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రం పోటీ పడాల్సిన అవసరం ఉందన్నారు జగన్.ప్రభుత్వ సహయం లేకుండా ఎలా చేస్తామని ఆయన ప్రశ్నించారు.
ఆంద్రప్రదేశ్ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళే పరిస్థితిలో ఉంది
రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళ్ళకపోతే మరో 20 నుండి 30 ఏళ్ళ పాటు రాష్ట్రం వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సాధించిన అభివృద్దిని నిలబెట్టుకోవాలని, మరో మెట్టుకు ఎదగాలని ఆయన సూచించారు.ప్రత్యేక హోదా అనేది ఒక్కటే బ్రహ్మస్తంగా పనిచేస్తోందని జగన్ అభిప్రాయపడ్డారు. ఈ విషయాలన్నీ ప్రభుత్వాలకు తెలియనివి కావన్నారు జగన్.
ప్రత్యేక హోదాను విస్మరించిన బిజెపి ,టిడిపి
ఎన్నికల సమయంలో ప్రత్యేకహోదా అంశాన్ని బిజెపి, టిడిపిలు ప్రచారం చేసిన విషయాన్ని జగన్ ప్రస్తావించారు. ఎన్నికల ప్రచార సభల్లో వెంకయ్యనాయుడు , చంద్రబాబునాయుడులు ప్రత్యేక హోదా గురించి ఊదరగొట్టారని ఆయన గుర్తుచేశారు. ఆంద్రప్రదేశ్ ప్రాంతానికి చెందిన యువతకు ఉద్యోగాలు రావాలంటే ప్రత్యేక హోదా అవసరమన్నారు.ఇతర రాష్ట్రాల నుండి ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ఉద్యోగాలు రావడమే ప్రత్యేక హోదా అని జగన్ చెప్పారు.ప్రత్యేక హోదాను చంద్రబాబునాయుడు దగ్గరుండి కత్తితో పొడుస్తున్నారని ఆయన ఆరోపించారు.
పోరాటం చేసే వారిని అణిచివేస్తున్నారు.
ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నవారిని చంద్రబాబునాయుడు అణిచివేస్తున్నారని జగన్ ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తే ఆర్ టి సి బస్సులను నడిపిస్తున్నారని ధర్నాలు చేస్తే నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆందోళనలు చేసే విధ్యార్థులు, యువతపై పిడీ యాక్టులు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారు.
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబునాయుడు ఐదున్నర కోట్ల ఆంద్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారని ఆయన ఆరోపించారు.తెలుగు ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని ఆయన విమర్శించారు. తెలుగు జాతి ప్రయోజనాల కోసం ఎన్ టి ఆర్ పార్టీని ఏర్పాటు చేస్తే, తెలుగు జాతి ప్రయోజనాలకు బాబు ఢిల్లీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఆయన దుయ్యబట్టారు. బాబు వ్యవహరశైలి చూస్తే ఎన్ టి ఆర్ ఆత్మ కూడ ఆత్మహత్య చేసుకొంటుందన్నారు.
ప్రత్యేక హోదా కోసం ప్రభుత్వం పై ఒత్తిడి
రానున్న రోజుల్లో ప్రత్యేక హోదా కోసం పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. జూలై మాసంలో మూడేళ్ళ పాలన ముగుస్తోంది. అప్పుడు పార్లమెంట్ సమావేశాలు సాగుతాయి. అయితే ఆ సమావేశాల్లో తమ పార్టీకి చెందిన ఎంపిలు రాజీనామా చేస్తారని చెప్పారు. ఆ సమయంలో దేశం మొత్తం ఆంద్రప్రదేశ్ వైపు చూస్తోందని ఆయన చెప్పారు.