మా ఎంపీలతో రాజీనామా చేయిస్తా: జగన్
కర్నూలు: ప్రత్యేక హోదా కోసం పార్లమెంటు శీతాకాల సమావేశాలను, బడ్జెట్ సమావేశాలనూ స్తంభింప జేస్తామని వైయస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఇంకా వినకపోతే మళ్లీ వచ్చే బడ్జెట్ సమావేశాల వరకు తమ పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తామని తేల్చి చెప్పారు. ఆ తర్వాత ఉప ఎన్నికలకు పోతామని, మళ్లీ గెలిచి పార్లమెంటులో హోదా వాదన వినిపిస్తామని స్పష్టం చేశారు.
ప్రత్యేక హోదా కోసం కర్నూలులో నిర్వహించిన యువభేరీలో జగన్ ప్రసంగించారు. హోదాతో అనేక రాయితీలు వస్తాయని, దీంతో పరిశ్రమలు అవే వస్తాయని చెప్పారు. బాబు మోసాలను చూస్తే బాధేస్తోందని అన్నారు. చంద్రబాబు హోదా కోసం పోరాటం చేయడం మర్చి రాజీపడిపోయారని ఆరోపించారు.
అరుణ్ జైట్లీ ఇటీవల(సెప్టెంబర్ 8, 2016) అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రకటన ఇచ్చారని, అందులో హోదా ఇవ్వలేమని చెప్పారని అన్నారు. అయితే, జైట్లీ ప్రకటను చంద్రబాబు స్వాగతించారని అన్నారు. అసలు చంద్రబాబుకు ఇంగ్గీష్ వచ్చా? అని జగన్ ప్రశ్నించారు. మోడీ, జైట్లీకి కృతజ్ఞతలు చెప్పడంతోపాటు వెంకయ్యకు సన్మానం చేశారని అన్నారు.
కోతలు విధించి ప్యాకేజీలు ఇస్తే బాబు చంకలు ఎగురేసుకుంటున్నారని మండిపడ్డారు. విభజన సమయంలో ఇచ్చిన హామీల కంటే ఎక్కువగా ఇస్తే దాన్ని ప్యాకేజీ అంటారని చెప్పారు. విభజన చట్టంలో దుర్గరాజపట్నంలో కొత్త పోర్టును 2018లోపు తామే నిర్మిస్తామని కేంద్రం చెప్పిందని, ఇప్పుడు జైట్లీ ఆ పోర్టును పీపీపీ పద్ధతిలో నిర్మిస్తామంటున్నారని అన్నారు.
జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి పోలవరం ప్రాజెక్టును కూడా కేంద్రమే పూర్తి ఖర్చులతో నిర్మిస్తుందని చట్టంలో చెప్పిందని, ఇప్పుడు ఆ హామీని కూడా నిలబెట్టుకోలేని పరిస్థితి కేంద్రం ఉందని ఆరోపించారు. చంద్రబాబు హోదాతో పెద్ద ప్రయోజనం లేదంటూ ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. హోదా ఉండటం వల్ల ఉత్తరాఖండ్ రాష్ట్రంలో 30వేల కోట్లు పెట్టుబడులు, భారీగా పరిశ్రమలు వచ్చాయని జగన్ చెప్పారు.
జగన్ ఒక్కడితోనే ప్రత్యేక హోదా సాధ్యం కాదని, అందరం కలిసి పోరాడితే అది సాధ్యమవుతుందని అన్నారు. ఈరోజు కాకుంటే రేపైనా హోదా వస్తుందని అన్నారు. హోదా ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో ఓటు వేస్తామని గట్టిగా చెప్పాలని అన్నారు.
2019లో కూడా ఎన్నికల ఇష్యూగా హోదా అంశాన్ని మారుస్తామని వైయస్ జగన్ తెలిపారు. ఎవడైనా ఓట్ల కోసం మైక్ పట్టుకుంటే.. హోదా ఇస్తేనే ఓట్లు అడిగే పరిస్థితి తెస్తామని ఆయన అన్నారు. 'జగన్కు మీరందరూ తొడుగా నిలబడితే హోదా సాధ్యమవుతుంది' అని వైయస్ జగన్ తెలిపారు. జగన్ వద్ద మంత్ర దండం లేదని, బాబు దగ్గరా లేదని, హోదాతోనే రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఉద్యోగావకాశాలు వస్తాయని వివరించారు.