విజయమ్మ కామ్: వైసిపిలో జగన్ తర్వాత బొత్సనే?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ పార్టీకి సంబంధించి ప్రధానమైన బాధ్యతలు అప్పగించినట్లు చెబుతున్నారు. ఆయనను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేయకపోయినప్పటికీ బాధ్యతల విషయంలో మాత్రం ఆ స్థాయినే కల్పించినట్లు చెబుతున్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలిగా ఉన్నప్పటికీ వైయస్ విజయమ్మ చాలా కాలంగా మౌనంగానే ఉంటున్నారు. దాంతో పార్టీకి ఒక రకమైన పెద్ద దిక్కుగా బొత్స సేవలందిస్తారని అంటున్నారు.
తన గైర్హాజరీలో పార్టీ వ్యవహారాలన్నీ బొత్స సత్యనారాయణ చూసుకునే విధంగా జగన్ ఏర్పాట్లు చేశారని అంటున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉండి, వ్యవహారాలను చక్కదిద్దుతూ, ప్రత్యర్థి పార్టీలపై మాట్లాడే విధంగా ఆయన బాధ్యతలను అప్పగించినట్లు చెబుతున్నారు. అందుకే, ఇటీవల ప్రతి విషయంపైనా బొత్స సత్యనారాయణే ప్రధానంగా ప్రతిస్పందిస్తున్నారని అంటున్నారు.
రాజకీయానుభవం, విషయాల పట్ల అవగాహన మాత్రమే కాకుండా మీడియా దృష్టిలో ఓ స్థాయి బొత్స సత్యనారాయణకు ఉందని, దానివల్ల పార్టీ వైఖరి ప్రజల్లోకి ఎక్కువగా వెళ్తుందని జగన్ భావించినట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మీడియాను ఉద్దేశించి గతంలో ఎవరు మాట్లాడినా పెద్దగా ప్రాధాన్యం లభించలేదని గుర్తించిన జగన్ ఆ ఏర్పాటు చేశారని అంటున్నారు. గతంలో కేంద్ర కార్యాలయంలో కూర్చుని మాట్లాడినవారిలో చాలా మంది జూనియర్లు కావడం, మీడియా దృష్టిలో అంతగా ప్రాధాన్యం లేనివారు కావడం వల్లనే అలా జరిగిందని అంటున్నారు.
ఓటుకు నోటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై, మంత్రులపై, టిడిపి నాయకులపై బొత్స సత్యనారాయణ మాట్లాడే తీరు పార్టీకి ఉపయోగపడిందని కూడా ఆయన భావించారని సమాచారం. ప్రతి విషయం మీదా తాను మాట్లాడడం కుదరదనే ఉద్దేశంతో బొత్స ప్రాధాన్యాన్ని పెంచినట్లు చెబుతున్నారు. కర్నూలు జిల్లాలో తమ పార్టీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి అరెస్టు వ్యవహారంపై కూడా బొత్స సత్యనారాయణే ప్రధానంగా మాట్లాడడం దానికి నిదర్శనమని అంటున్నారు.
పైగా, బొత్స సత్యనారాయణ జగన్ తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడు కూడా. జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నవారిలో బొత్స సత్యనారాయణ కూడా ఉన్నారని అంటారు. బలమైన వాగ్ధాటి, స్టేచర్ గల నాయకుడు కావాలనే ఉద్దేశంతోనే బొత్సకు ప్రాధాన్యం ఇచ్చినట్లు చెబుతున్నారు.
పార్టీ అంతా కుటుంబ సభ్యులతోనే నడుస్తుందనే అభిప్రాయం బలంగా ఉన్న నేపథ్యంలో దాన్ని తుడిచి వేయడానికి బొత్స పాత్రను పెంచడం ఉపయోగపడుతుందని జగన్ భావించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు పార్టీలో జగన్ తర్వాత బొత్సనే అనే ప్రచారం సాగుతోంది.