పితృదేవతలకు పిండ ప్రదానం: పున్నమి ఘాట్లో జగన్ను చూసేందుకు ఎగబడ్డ జనం
మరావతి: వైసీపీ అధినేత వైయస్ జగన్ గురువారం కృష్ణా పుష్కరాలకు వెళ్లారు. విజయవాడలోని వీఐపీ ఘాట్ అయిన పున్నమి ఘాట్లో ఆయన పుష్కర స్నానం ఆచరించారు. హైదరాబాద్ నుంచి ఉదయం 9 గంటలకు బయల్దేరి గన్నవరం విమానాశ్రయానికి జగన్ చేరుకున్నారు.
తొలుత నగరంలోని లబ్బీపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత కంచి జయేంద్ర సరస్వతిని జగన్ కలుసుకున్నారు. పార్టీ నేతలు కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), జోగి రమేశ్, సామినేని ఉదయభాను తదితరులు వెంట రాగా వైఎస్ జగన్ శాస్త్రోక్తంగా పుష్కర స్నానం చేశారు.
అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆ తర్వాత తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తాత వైఎస్ రాజారెడ్డిలకు ఆయన పిండ ప్రదానం చేశారు. పుష్కర ఘాట్ కు వచ్చిన జగన్ ను చూసేందుకు, ఆయనతో కరచాలనం చేసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఆసక్తి చూపారు.
అక్కడ జన సందోహం పెరగడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు నానా తంటాలు పడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా పోలీసులు, వైసీపీ కార్యకర్తల మధ్య స్వల్ప వాగ్వాదం కూడా చోటుచేసుకుంది. పుష్కర స్నానం అనంతరం మంగళవారం పుష్కరాల కోసం వచ్చి నీట మునిగిన విద్యార్థుల కుటుంబాలను పరామర్శించేందుకు జగన్ నందిగామకు వెళతారు.
చంద్రబాబుపై రవిశంకర్ గురూజీ ఆసక్తికర వ్యాఖ్యలు
కృష్ణా పుష్కరాల్లో స్నానమాచరించేందుకు బుధవారం విజయవాడ చేరుకున్న 'ఆర్ట్ ఆఫ్ లివింగ్' వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ, ఏపీ సీఎం చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుతో కలిసి బుధవారం రాత్రి హారతి కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూనే దానికి పురాతన విద్యను జోడించి చంద్రబాబు కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారని ప్రసంశించారు.
పుష్కర ఘాట్ల నిర్వహణ తీరు, పుష్కరాల్లో పర్యావరణానికి ఎలాంటి హానీ లేకుండా ఏపీ ప్రభుత్వం చక్కగా కార్యక్రమాలను నిర్వహిస్తోందని ఆయన మెచ్చుకున్నారు. పుష్కర ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. కృష్ణా పుష్కరాల ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు.
పుష్కరాలు కుంభమేళాను తలపించేలా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఘాట్లలో ఎక్కడా ప్లాస్టిక్ వ్యర్థాలు లేకుండా చేయడం చాలా బాగుందన్నారు.
శ్రావణ పౌర్ణమి సందర్భంగా పుష్కర ఘాట్లకు పోటెత్తిన భక్తులు
కృష్ణా పుష్కరాలు ఏడో రోజుకు చేరుకున్నాయి. గురువారం శ్రావణ పౌర్ణమి కావడంతో రెండు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లన్నీ భక్తుల జనసందోహంతో కిటకిటలాడుతున్నాయి.
ఇప్పటికే పుష్కర స్నానం చేసిన పులువురు గురువారం శ్రావణ పౌర్ణమి సందర్భాన్ని పురస్కరించుకుని మరోమారు పుష్కర స్నానం ఆచరిస్తున్నారు. ఇందులో భాగంగా విజయవాడలో ఎంపీ కేశినేని నాని దంపతులు పవిత్ర సంగమం వద్ద పుష్కర స్నానం చేశారు. ఏపీ హోం మంత్రి చినరాజప్ప గురువారం జ్ఞానబుద్ధ పుష్కర ఘాట్లో పుష్కరస్నామాచరించారు.