దేవుడే మొట్టికాయలేస్తాడు!: రక్షణ లేదంటూ బాబుపై జగన్ ఫైర్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
గురువారం ఉదయం విజయవాడలోని పున్నమి ఘాట్ లో పుష్కర స్నానం చేసిన జగన్... అనంతరం ఇబ్రహీంపట్నం వెళ్లి అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సర్కారు చేసిన పుష్కర ఏర్పాట్లన్నింటినీ ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలుగా ఆయన అభివర్ణించారు. పుష్కర ఏర్పాట్ల పేరిట గుళ్లు, గోపురాలు, నేతల విగ్రహాలను ప్రభుత్వం తొలగించిందని వైయస్ జగన్ మండిపడ్డారు.
ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని పగులగొట్టి బుడమేరు కాల్వలో పడేయడం చంద్రబాబు దాష్టికానికి నిదర్శనమని అన్నారు. బాబు పాలనలో గాంధీజీ, వైయస్సార్ విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు.
చంద్రబాబు దుర్మార్గలకు ఆ దేవుడే మొట్టికాయలు వేయాలని అన్నారు. సదావర్తి సత్రం భూములను బినామీలకు కట్టబెట్టారని విమర్శించారు. చంద్రబాబు ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతోందని, ఆయనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని అన్నారు.