కారులో కూర్చోబెట్టుకొని మాట్లాడిన జగన్, 'విజయమ్మ అలా చెప్పగలరా'
విజయవాడ: భారీ వర్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పల్నాడు ప్రాంతంలో వైసిపి అధినేత వైయస్ జగన్ సోమవారం నాడు పర్యటించారు. దాచేపల్లికి వచ్చిన ఆయనకు రైతులు, వైసిపి అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించింది.
ఆయన కాన్వాయ్ అత్యంత నిదానంగా సాగింది. తనను చూసేందుకు వచ్చిన ప్రజలకు జగన్ నవ్వుతూ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.
దాచేపల్లి దాటిన అనంతరం ముత్యాలంపాడు వరకూ ఏడు కి.మీ. దూరం పాదయాత్రగా జగన్ వెళ్తారని,దారిలో దెబ్బతిన్న పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడుతారని వైసిపి వర్గాలు వెల్లడించాయి. అనంతరం తిరిగి దాచేపల్లికి వచ్చి కాటేరు వాగును ఆయన పరిశీలిస్తారన్నారు.
తదుపరి గురజాల సమీప ప్రాంతాలైన జంగమేశ్వరపురం, చర్ల గుడిపాడు గ్రామాలను సందర్శిస్తారన్నారు. ఇదిలా ఉండగా, దాచేపల్లిలో తనను పలకరించేందుకు వచ్చిన ఓ రైతును జగన్ తన కారులోకి ఆహ్వానించి, వర్షాల గురించి అడిగి తెలుసుకున్నారు.
ఎంత మేర నష్టం వాటిల్లింది? పెట్టుబడి ఎంత పెట్టారు? బ్యాంకుల రుణాల పరిస్థితి ఏమిటి? తిరిగి పంటను వేసుకునే వీలుందా? వంటి పలు ప్రశ్నలు అఢిగారు. మరోచోట వాహనం దిగి రైతుల వద్దకు వెళ్లి అండగా ఉంటానని హామీ ఇచ్చారు.
ఎన్నారైలకు వైయస్ జగన్ ట్వీట్
ఏపీకి ప్రత్యేక హోదాను సాధించే దిశగా ప్రవాస భారతీయులు చూపిన ఉత్సాహం తనలో పట్టుదలను మరింత పెంచిందని జగన్ ట్వీట్ చేశారు. గత రాత్రి పలు దేశాలకు చెందిన ఎన్నారైలతో జగన్ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం విజయవంతం కావడంపై జగన్ స్పందించారు. తన ఎన్నారై సోదర సోదరీమణులు చూపిన ఉత్సాహంతో ఏపీకి ప్రత్యేక హోదా సాధన దిశగా తన పట్టుదల రెండింతలైందని, మీ అందరికీ కృతజ్ఞతలు అన్నారు.
జగన్ను ఆదర్శంగా తీసుకొమ్మనగలరా?: వర్ల
ప్రత్యేక హోదా అంశంపై జగన్ ఆదివారం రాత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రవాసాంధ్రులతో చర్చించడం పట్ల టిడిపి ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య కర్నూలు జిల్లాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జగన్ ఏ అర్హతతో ఆ కార్యక్రమం నిర్వహించారని ప్రశ్నించారు.
జగన్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని యువతకు చెప్పే ధైర్యం జగన్ తల్లి విజయమ్మకు ఉందా? అన్నారు. జగన్ చేసిన అవినీతి వల్ల ఎంతో మంది ఐఏఎస్లు నానా ఇబ్బందులు పడ్డారన్నారు. కాపుల బహిరంగ సభ సందర్భంగా తునిలో జరిగిన విధ్వంసం కేసులో జగన్ పాత్రపై విచారణ జరిపించాల్సి ఉందన్నారు.