బాబు, లోకేష్ బాటలో జగన్: రచ్చ చేస్తున్న టీడీపీ(వీడియో)
అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ చేసిన ప్రసంగాల్లో తప్పులు దొర్లిన విషయం తెలిసిందే. తాజాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేసి దొరికిపోయారు. బాబు, లోకేష్లపై ఇప్పటి వరకూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు విమర్శలతో విరుచుకుపడగా.. ఇప్పుడు అవకాశం దొరకడంతో తెలుగుదేశం పార్టీ నేతలు కూడా అదే స్థాయి విమర్శలతో ఉతికేస్తున్నారు.
గరగపర్రులో మంచిమాటలు
అసలేం జరిగిందంటే.. గరగపర్రులో దళితులు, దళితేతరులు మధ్య జరిగిన గొడవ సాంఘిక బహిష్కరణ వరకూ వెళ్లింది. దీంతో గురువారం వైయస్ జగన్మోహన్ రెడ్డి గరగపర్రులో పర్యటించారు. ఇరువర్గాలతో ఆయన మాట్లాడారు. ఒకే ఊరిలో ఉంటూ ఇలాంటి సాంఘిక బహిష్కరణలు చేసుకోవడం తగదని అన్నారు. అందరం కలిసే ఉండాలని హితవు పలికారు.
పొరపాటున జగన్ ఇలా..
ఇక్కడికి వరకు బాగానే ఉన్నా... ఈ ఘటనపై జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘బాధితుల్ని ముందు అరెస్ట్ చేస్తే' ఈ గొడవ లేకపోయేది కాదా? అని అన్నారు. దీంతో సొంత పార్టీ నాయకులు, అక్కడున్నవారితోపాటు మీడియా ప్రతినిధులు కూడా షాకయ్యారు.
అనుకున్నది ఒకటి.. అన్నది మరోటి
అయితే, నిజానికి జగన్ చెప్పాలనుకున్నది ఒకటి చెప్పింది ఒకటి అని అర్థమవుతోంది. ‘నిందితుల్ని ముందే అరెస్ట్ చేస్తే ఇంత గొడవ ఉండేది కాదు కదా' అని చెప్పబోయి.. బాధితుల్ని అని అనేశారు వైయస్ జగన్. దీంతో అధికార పార్టీ నాయకులపై ఇప్పటి వరకు సెటైర్లు వేసిన పార్టీ నేతలకు అధినేతే టీడీపీకి దొరికిపోయినట్లయింది.
జగన్పై విరుచుకుపడిన టీడీపీ
ఇంకేముంది జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ నేతలు విమర్శల వర్షం కురిపించారు. బాధితులకు అండగా నిలవాల్సింది పోయి.. బాధితులనే అరెస్ట్ చేయమంటారా? అంటూ ఆయనపై ధ్వజమెత్తుతున్నారు. తమ నేతలు పొరపాటున చేసిన వ్యాఖ్యలపై సెటైర్లు వేసే నాయకులు ఇప్పుడెందుకు మాట్లాడరని ప్రశ్నిస్తున్నారు. అంతేగాక, జగన్ ఈ వ్యాఖ్యల వీడియోను సోషల్ మీడియా పెట్టి సెటైర్లు వేస్తున్నారు.
లోకేష్పై నిప్పులుచెరిగారు..
కాగా, ఇటీవల మంత్రి నారా లోకేష్ కూడా పొరపాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని వర్ధంతి శుభాకాంక్షలు చెప్పడం విమర్శలకు దారితీసింది. జయంతికి, వర్ధంతికి తేడా తెలియని వారు కూడా మంత్రి అవుతున్నారంటూ జగన్ పార్టీ నేతలు నిప్పులు చెరిగారు.
చంద్రబాబునూ వదల్లేదు...
తాజాగా చేసిన పొరపాటు వ్యాఖ్యలకు చంద్రబాబుపై కూడా జగన్ పార్టీ నేతలు సెటైర్లు వేశారు. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీకాంత్ ను ఏపీ ప్రభుత్వం గత బుధవారం సన్మానించింది. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ఒలింపిక్స్లో గెలిస్తే కిదాంబి శ్రీకాంత్కు నోబెల్ బహుమతిని ఇస్తామంటూ ప్రకటించారు. దీంతో నోబెల్ ప్రైజ్ను.. క్రీడాకారులకు ఇవ్వరనే విషయం కూడా సీఎంకి తెలియదా? అంటూ విరుచుకుపడ్డారు జగన్ పార్టీ నేతలు.