వరదలపై ఢిల్లీలో అడుగుతాం, బాబు తిడితే ఎలా: జగన్, తిరుమలలో సుందర దృశ్యం కోసం క్యూ!
తిరుమల/నెల్లూరు: వరద బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను పార్లమెంటులో తమ పార్టీ తరఫున ప్రస్తావిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం నాడు అన్నారు.
ఆయన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించారు. వరద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. వరదలకు గ్రామాలకు గ్రామాలే మునిగిపోతే నారా చంద్రబాబు నాయుడు సర్కార్ ఒక్కరికీ కూడా సాయం చేయలేకపోయిందని ఆగ్రహించారు.
నిత్యావసర వస్తువులు, పనులు దొరకక బాధితులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణ సాయం కింద బాధిత కుటుంబాలకు కనీసం రూ.5వేలు ఇవ్వాలని జగన్ డిమాండ్ చేశారు. నిధులు ఇవ్వకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను తిడితే ఏం ప్రయోజమని ప్రశ్నించారు.
భారీ వర్షాల వల్ల నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో లక్షలాది ఎకరాలకు పంట నష్టం వాటిల్లిందన్నారు. కాగా, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే.
ఏడుకొండలపై సుందర దృశ్యం
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తిరుమల కొండల నుంచి నీరు జాలువారుతున్నాయి. కొండల నుంచి జాలువారుతున్న జలపాతలు భక్తులకు, సందర్శకులకు అద్భుతమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు ఎత్త్తెన కొండల నుంచి జలపాతలు జారుతున్న సుందర దృశ్యాలను తిలకించేందుకు పలు ప్రాంతాల నుంచి భారీగా ప్రజలు తరలివస్తున్నారు.