అంతా టిడిపి నేతల వల్లే: జగన్ పరామర్శ, వెంట తిరుపతి ఎంపీ
చిత్తూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాడు ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించారు. ఆదివారం ఉదయం రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న జగన్కు కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు.
రేణిగుంట నుంచి జగన్ మునగలపాలెం చేరుకున్నారు. అక్కడ 13 మంది మృతుల కుటుంబాలను పరామర్శించారు. ఇసుక మాఫియా వల్లే తమ వారు చనిపోయారని ఏర్పేడు ప్రమాద బాధితులు జగన్ ఎదుట గోడు వెళ్లబోసుకున్నారు.
జరిగిన దానికి అంతా తెలుగుదేశం పార్టీ నేతలే కారణమని జగన్ వద్ద వారు మొరపెట్టుకున్నారు. మృతుల కుటుంబాలను జగన్ పరామర్శించి ఓదార్చారు. బాధితులకు అండాగా ఉంటామని ఓదార్చారు.
మునగాలపాలెం నుంచి జగన్ ముసిలిపేడు, రావిళ్లవారిపల్లె అరుంధతి వాడ ప్రాంతాలకు వెళ్తారు. మార్గమధ్యలో స్వర్ణముఖి నదిలో ఇసుక గుంతలను పరీశిలించనున్నారు.
కాగా, ఇసుక అక్రమ దందాను ఆపివేయాలని డిమాండ్ చేస్తూ ఏర్పేడు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేస్తున్న గ్రామస్తుల పైకి ఓ లారీ అధుపు తప్పి దూసుకెళ్లడంతో 17 మందిమృతి చెందగా, పలువురు గాయపడ్డ విషయం తెలిసిందే.