'జైలులో ఎలా ఉండాలో విద్యార్థులకు జగన్ చెప్తారు, తర్వాతే రాజకీయం'
నెల్లూరు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న కార్యక్రమాలకు విద్యార్థులను పంపించవద్దని తెలుగుదేశం పార్టీ నేత ఆనం వివేకానంద రెడ్డి ఆదివారం నాడు అన్నారు. అక్కడకు వెళ్తే అవినీతి, అక్రమాలు ఎలా చేయాలో నేర్పుతారన్నారు.
అలాగే, జైలులో ఎలా ఉండాలో నేర్పుతారని ఎద్దేవా చేశారు. విద్యార్థులకు చదువు ముఖ్యమని చెప్పారు. ఆ తర్వాతే రాజకీయాలు చేయాలని హితవు పలికారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన ఆనం వివేకానంద ప్రశంసలు కురిపించారు.
చంద్రబాబు కింగ్ మేకర్ అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా ఆయనకే ఉందని చెప్పారు. తమ పార్టీ యువనేత నారా లోకేష్ కూడా తండ్రి చంద్రబాబు అడుగుజాడల్లో నడుస్తూ రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నారన్నారు.
వరద బాధితులను ఆదుకుంటాం: చంద్రబాబు
వరదల కారణంగా ఇబ్బందులు పడ్డ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లాలోని వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఆయన దాచేపల్లిలో ముంపు బాధిత రైతులతో ముఖాముఖి నిర్వహించారు.
వరదల కారణంగా పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లిస్తామని.. ఈ విషయంలో ఎవరికీ అన్యాయం జరగనీయబోమన్నారు. రహదారుల కల్వర్టులు బలహీనంగా ఉండటం వల్లనే వరదనీరు పొలాల్లోకి వచ్చిందని సీఎం తెలిపారు. నాసిరకంగా రహదారులు నిర్మించిన గుత్తేదారులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వరద బాధితులందరికీ రెండు మూడు రోజుల్లోనే పరిహారం అందిస్తామన్నారు.