అలాంటి మనిషి గురించి ఏం మాట్లాడ్తాం: చంద్రబాబుపై షర్మిల ఫైర్
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైయస్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అలాంటి మనిషి గురించి ఏం మాట్లాడుతామని ఆమె చంద్రబాబును ఉద్దేశించి అన్నారు. గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న జగన్ను పరామర్శించిన తర్వాత ఆమె మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు.
జగన్ శరీరంలో యూరిక్ ఆసిడ్ చాలా ఉందని వైద్యులు చెప్పినట్లు ఆయన తెలిపారు. 24 గంటల పాటు ఏమీ తినడానికి వీలు లేదని కూడా చెప్పినట్లు తెలిపారు. వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తున్నట్లు తెలిపారు. జగన్ చాలా నీరసంగా ఉన్నారని షర్మిల అన్నారు. జగన్ దీక్షతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మరక్షణలో పడ్డారని ఆమె అన్నారు.
ప్రత్యేక హోదా కోసం రాష్ట్రంలో ఆందోళనలు పెరుగుతాయనే భయంతో చంద్రబాబు జగన్ దీక్షను భగ్నం చేయించారని ఆమె విమర్శించారు. చంద్రబాబు గురించి అందరికీ తెలిసిందేనని, చంద్రబాబుకు పబ్లిక్ మీది కన్నా పబ్లిసిటీ మీద ఎక్కువ దృష్టి ఉంటుందని షర్మిల అన్నారు.
నిజానికి ప్రత్యేక హోదాను తేవాల్సిన బాధ్యత చంద్రబాబుదని, అయితే చంద్రబాబు ఆ బాధ్యతను విస్మరిస్తే జగన్ తన భుజాన వేసుకున్నారని, అందుకు జగన్ను అభినందించాల్సింది పోయి చలనం లేకుండా వ్యవహరించారని, పైగా మంత్రుల చేత హీనమైన వ్యాఖ్యలు చేయించారని, అలాంటి మనిషి గురించి ఏం మాట్లాడుతామని ఆమె అన్నారు.
పచ్చి అబద్ధాలు చెప్పి చంద్రబాబు అధికారంలోకి వచ్చారని, అటువంటి వ్యక్తి కూడా నాయకుడేనా అని ఆమె అన్నారు. ప్రతి సందర్బంలోనూ జగన్ తన వంతుగా ప్రత్యేక హోదా కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారని అన్నారు. జగన్ పోరాటం దీక్ష భగ్నంతో ఆగదని, జగన్ రికవరీ అవుతారని, పోరాటం కొనసాగిస్తారని షర్మిల అన్నారు.