హోదాతో నా ఇంటికేమైనా వస్తుందా: కంటతడి పెట్టిన విజయమ్మ (పిక్చర్స్)
గుంటూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే నా ఇంటికి వచ్చే లాభం ఏమిటని, తన బిడ్డ (జగన్) ప్రజల కోసమే దీక్ష చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ శనివారం నాడు అన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలంటూ వైసిపి అధ్యక్షులు వైయస్ జగన్ గుంటూరు జిల్లా నల్లపాటులో నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఆయనను విజయమ్మ పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.
ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కూడా అవసరమేనని చెప్పారు. పార్లమెంటులో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలోని హామీలన్నింటిని తప్పకుండా అమలు చేయాల్సిందేనని చెప్పారు.
చట్టంలో ఉన్న హామీలు రెండు తెచ్చి.. అన్నీ తెచ్చామని చెబితే ఎలా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాతో ఏపీకి పరిశ్రమలు వస్తాయని చెప్పారు. ఏపీ ప్రజల కోసమే తన బిడ్డ దీక్ష చేస్తున్నారన్నారు. హోదా వస్తే నా ఇంటికి వచ్చే లాభం ఏమిటని ప్రశ్నించారు.
ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పక్కన పెట్టి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు... రాష్ట్ర అభివృద్ధి, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలు, రాజధాని అంటూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ఏపీకి హోదా ఇస్తామని నాడు పార్లమెంటులో హామీ ఇచ్చారన్నారు.
ప్రత్యేక హోదా ఏపీ హక్కు అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వమే ఉంటుందనే గ్యారెంటీ ఉందా అని ప్రశ్నించారు. వైయస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ప్రాజెక్టులను పూర్తి చేయడం లేదన్నారు. చంద్రబాబు హోదా కోసం గట్టిగా ఎందుకు పోరాడటం లేదన్నారు. విమానాశ్రయాల పేరుతో భూములు లాక్కుంటున్నారన్నారు. కాగా, విజయమ్మ మాట్లాడుతూ జగన్ దీక్షను చూసి చలించిపోయారు. కంటతడి పెట్టారు.
జగన్కు సిపిఎం సంఘీభావం
జగన్ దీక్షకు సిపిఎం మధు సంఘీభావం తెలిపారు. హామీల అమలులో ప్రభుత్వాలు విఫలమయ్యాయని మండిపడ్డారు. కాగా, జగన్ దీక్షకు సంఘీభావంగా విజయనగరం జిల్లాలో ర్యాలీ నిర్వహించారు. ఇదిలా ఉండగా, జగన్ దీక్ష 70 గంటలు దాటింది.