చంద్రబాబు ఏపికి ముఖ్యమంత్రి ఎలా అయ్యారు?: పద్మ
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ.. హైదరాబాద్లో ఆధార్ కార్డు ఉంటే ఏపిలో రుణమాఫీ చేయడం కుదరదని అంటున్నారని, అయితే చంద్రబాబునాయుడి ఆధార్ కార్డు, ఓటు హక్కు హైదరాబాద్లో ఉంటే ఆయన ఏపికి సిఎం ఎలా అయ్యారని ప్రశ్నించారు.
సీమాంధ్రలో ఓట్ల కోసం హైదరాబాద్ నుంచి జనాన్ని తరలించినప్పుడు ఈ విషయం గుర్తులేదా? అని ఆమె అన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రతీ పథకానికి ఆధార్ను అడ్డుపెట్టుకొని కోతలు విధించడం దారుణం అన్నారు. ఆధార్ కార్డు హైదరాబాద్లో ఉండి, ఏపిలో భూములు ఉన్న రైతులు చాలామంది ఉన్నారని పద్మ తెలిపారు.
ఆధార్ కార్డ్ విషయంలో నిజాయితీగా ఉండే రైతులతో అబద్ధాలు చెప్పించే దుస్థితికి చంద్రబాబు దిగజారారని దుయ్యబట్టారు. రుణవిముక్తి పత్రాల పేరుతో రైతులను మోసం చేస్తున్నారని వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. రుణమాఫీ కోసం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా పని చేయడం లేదని అన్నారు. ఎవరిని మోసగించడానికి చంద్రబాబునాయుడు సన్మానాలు చేయించుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు.
టిడిపి కార్యకర్తలకే తుఫాను సాయం: రఘువీరా
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నకిలీ బాధితులకు హుధుద్ తుఫాను నష్టపరిహారాన్ని దోచి పెడుతున్నారని ఏపి పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆరోపించారు. తుఫాను సాయంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. తుఫాను కారణంగా నష్టపోయిన అసలైన బాధితులకు పరిహారం అందట్లేదని ఆరోపించారు.