బాలకృష్ణకు అవమానం: రోజా, వారించిన కోడెల, ఒక్క సారీ: జగన్
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కళాకారులను అవమానించేలా మాట్లాడారని, ఎన్టీఆర్, బాలకృష్ణలను కూడా కించపరిచినట్లేనని నగరి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రోజా సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు శాసన సభ తిరిగి ప్రారంభమైన అనంతరం సభలో అన్నారు.
వ్యక్తిగత దాడులు చేస్తుంటే మౌనంగా ఉండమని చెప్పడం అన్యాయమని సభాపతి కోడెల శివప్రసాద్తో అన్నారు. సభ్యసమాజం తలదించుకునే రీతిలో గోరంట్ల మాట్లాడారన్నారు. కళాకారుడు స్థాపించిన పార్టీలో కొనసాగుతున్నారన్నారు. సభలో లేని వ్యక్తి గురించి మాట్లాడకూడదని అసెంబ్లీ రూల్స్ బుక్ చెబుతుందన్నారు. సభలో లేని వైయస్ గురించి ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. అది బాధాకరమన్నారు.
రోజాను వారించిన కోడెల
రోజా సభాపతిని తప్పు పట్టడంతో కోడెల ఆమెతో హోల్డ్ యువర్ టంగ్ అన్నారు. రికార్డులు చూస్తామని, ఎవరిది తప్పు చూస్తామన్నారు. వీడియోను చూసి సమస్యను పరిష్కరించుకుందామన్నారు.
ఎవరు తప్పు చేస్తే వారు క్షమాపణ చెప్పాలి: యనమల
మంత్రి యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ.. ఎవరు తప్పు చేస్తే వారు క్షమాపణ చెప్పాలని, సభాపతి రికార్డులు చూసి నిర్ణయించాలన్నారు.
అర్హత ఉందా లేదా: జగన్
ఓ మహిళను సభలో దూషించినప్పటికీ మనం ఎమ్మెల్యేలుగా చూస్తూ ఊరుకుంటే ఆ పదవులకు మనం అర్హత కలిగిన వారమా కాదా అని ఆలోచించాలని ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. మీరు క్షమాపణ చెప్పించలేని పరిస్థితిలో ఉంటే ఇక ఈ సభలో తమకు ఏ రకంగా న్యాయం జరుగుతుందనుకోవాలని ప్రశ్నించారు.
రోజాను ఉద్దేశించి గోరంట్ల అవహేనళన చేశారన్నారు. ఓ సమయంలో జగన్ మాట్లాడుతూ.. ఓ మహిళా ఎమ్మెల్యేకు క్షమాపణ చెబితే తప్పేమిటని జగన్ ప్రశ్నించారు. క్షమాపణకు ఒక్క నిమిషం అన్నారు. దీనిపై యనమల మాట్లాడుతూ.. సీఆర్డీఏ బిల్లు రాకుండా ప్రతిపక్షం ఇలా చేస్తోందన్నారు. రికార్డులు చూశాకే ఎవరిది తప్పైతే వారు క్షమాపణ చెబుతారన్నారు. ప్రతిపక్షానిది డ్రామా అన్నారు.