జగన్ పార్టీ గొడవ: ఇంత దౌర్భాగ్యమైన ప్రతిపక్షాన్ని చూడలేదని బాబు చిరాకు
హైదరాబాద్: పట్టిసీమపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్న సమయంలో తమకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెసు సభ్యులు బుధవారం శాసనసభలో గందరగోళం సృష్టించారు. ఈ సమయంలో చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత దౌర్భాగ్యమైన ప్రతిపక్షాన్ని తాను ఇంత వరకు చూడలేదని అన్నారు. నోరుంది కదా అని ఇష్టం ఉన్నట్లు మాట్లాడితే సహించబోమని అన్నారు.
సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని, పార్టీ అంతర్గత సమస్యను తీసుకొచ్చి ఇక్కడ గొడవ చేస్తున్నారని ఆయన అన్నారు. అది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంతర్గత సమస్య అని ఆయన అన్నారు. దయచేసి కూర్చోండి అంటూ స్పీకర్ కోడెల శివప్రసాద రావు పదే పదే చెప్పినప్పటికీ వారు వినిపించుకోలేదు. కొంత సేపటి తర్వాత వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యుడు జ్యోతుల నెహ్రూ మాట్లాడారు.
సభలో తప్పుడు సమాచారం ఇచ్చారని ఆయన అన్నారు. వైఎస్ ఏం చేయలేదని అధికార పక్షం అనడాన్ని ఆయన ఖండించారు. వైఎస్ చేపట్టిన ప్రాజెక్టు ద్వారానే రాయలసీమకు నీరు ఇచ్చారని, రాయలసీమ ప్రయోజనాలకు తాము కట్టుబడి ఉన్నామ ని ఆయన చెప్పారు.
జ్యోతుల నెహ్రూ మాట్లాడడానికి ముందు వైయస్సార్ కాంగ్రెసు సభ్యులను ఉద్దేశించి చంద్రబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుందాతనం అవసరమా, లేదా అని ఆయన అడిగారు. జాతీయ పార్టీగా స్పష్టమైన మెజారిటీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బిజెపిని పట్టుకుని తోక పార్టీ అనడం సరి కాదని ఆయన అన్నారు. నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. కొంత మంది సభ్యులైతే ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడిన తర్వాత సభ సద్దుమణిగింది. చంద్రబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించి కొనసాగించారు.