ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న భూమా నాగిరెడ్డి: హైదరాబాద్కు తరలింపు
కర్నూలు/హైదరాబాద్: ఛాతినొప్పి, హైబీపీతో బాధపడుతున్న వైయస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ నిమ్స్కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా పోలీసు అధికారులను దూషించారంటూ భూమాపై కేసులు నమోదైన విషయం తెలిసిందే.
శుక్రవారం సాయంత్రం ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. భూమా నాగిరెడ్డికి 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రస్తుతం ఆళ్లగడ్డ సబ్ జైల్లో ఉన్న ఆయనను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్కు తరలించే ఏర్పాటు చేశారు.
శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాల వివరాలిలా ఉన్నాయి. ఏపీలోని కర్నూలు జిల్లా పోలీసుల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి శుక్రవారం నాడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దీంతో పోలీసులు అతని పైన కేసు నమోదు చేశారు. స్థానిక సంస్థల కోటా కింద జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్ కేంద్రం వద్ద పోలీసులను దూషించడంతో కేసు నమోదయింది.
తమ విధులకు ఆటంకం కలిగించారంటూ డీఎస్పీ దేవదానం ఫిర్యాదు చేశారు. తనను తాకవద్దంటూ భూమా అహంకారం ప్రదర్శించారంటూ డీఎస్పీ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ పట్ల దురుసుగా ప్రవర్తించిన భూమా నాగి రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, భూమా ఇంటి వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దాదాపు వందమంది పోలీసులు మోహరించారు. దీంతో, స్థానికంగా ఉద్రిక్త ఏర్పడింది.
అంతకుముందు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ వచ్చారు. ఈ సమయంలో పోలీసులతో అఖిలప్రియ వాగ్వాదానికి దిగారు. ఆ సమయంలోనే వచ్చిన భూమా నాగిరెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు.
తన కూతురును వెళ్లమని చెప్పేందుకు మీరెవరని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనల పుస్తకం చూపించాలని అడిగారు. నా కూతురును వెళ్లమంటారా అని ప్రశ్నించారు. దీంతో పోలీసులు... తాము వెళ్లమని చెప్పలేదని, టెంటు కింద కూర్చోమని చెప్పామని తెలిపారు.