ఒక కేసులో భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరు
కర్నూలు: వివిధ కేసుల్లో అరెస్టయిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డికి బెయిల్ మంజూరైంది. భూమా నాగిరెడ్డితో పాటు మరో 20 మందికి బెయిల్ మంజూరు చేస్తూ కర్నూలు జిల్లా నంద్యాల మూడో అదనపు మెజిస్ట్రేట్ కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. హత్యాప్రయత్నంతో పాటు వివిధ కేసులను ఆయనపై పోలీసులు నమోదు చేశారు. ఒక కేసులో ఆయన బెయిల్ లభించింది. మరో రెండు కేసుల్లో ఆయన బెయిల్ రావాల్సి ఉంది.
నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో భూమా నాగిరెడ్డితో పాటు పలువురిపై హత్యాప్రయత్నం కింద కేసులు పెట్టారు. ఆయనపై రౌడీ షీట్ కూడా తెరిచారు. హత్యాప్రయత్నం కేసులో భూమా నాగిరెడ్డి కోర్టు ముందు లొంగిపోయారు. దాంతో ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.
ఆ తర్వాత ఆయన అనారోగ్యానికి గురి కావడంతో హైదరాబాదులోని నిజాం వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)కు చికిత్స నిమిత్తం తరలించారు. పోలీసుల కస్టడీలో ఉండడంతో తన కూతురు, ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ ప్రమాణ స్వీకారానికి కూడా భూమా నాగిరెడ్డి హాజరు కాలేకపోయారు.
ఇటీవల కర్నూలు జిల్లా నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ సమావేశంలో చోటు చేసుకున్న తోపులాట, ఘర్షణ నేపథ్యంలో ప్రతిపక్ష భూమా నాగిరెడ్డిపై హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేశారు. ఆయనను అరెస్టు చేసేందుకు రాత్రికి రాత్రి ఆయన ఇంటి వద్ద పోలీసులు మోహరించారు. నంద్యాల మునిసిపల్ కౌన్సిల్ గత నెలాఖరున తెలుగుదేశం పార్టీకి చెందిన చైర్పర్సన్ దేశం సులోచన అధ్యక్షతన సమావేశమైంది. వైయస్సార్సీపీ ఫ్లోర్ లీడర్ అనూష సమావేశానికి గైర్హాజరు కావడంతో ఆమె స్థానంలో డిప్యూటీ నేత వాకా శివశంకర్, మరో కౌన్సిలర్ కృపాకర్ కూర్చున్నారు.
వారు వెనక కుర్చీల్లోకి వెళ్లాలని టిడిపి కౌన్సిలర్లు గొడవకు దిగారు. శివశంకర్ సమాధానం చెబుతుండగా ఆయనను సస్పెండ్ చేస్తానంటూ చైర్పర్సన్ హెచ్చరించారు. ఇంతలో సమావేశానికి భూమా నాగిరెడ్డి వచ్చారు. వివాదాన్ని తగ్గించడానికి అంటూ శివశంకర్ కుర్చీలో కూర్చోవాలని సూచించారు. గొడవ నేపథ్యంలో ఎజెండా చేపట్టకుండానే సమావేశం ముగిసిందని చైర్పర్సన్ ప్రకటించారు. అయితే, భూమా నాగిరెడ్డి కల్పించుకుని తాను పట్టణ సమస్యలపై చర్చించాల్సి ఉందని పట్టుబట్టి మాట్లాడడం ప్రారంభించారు. అయితే, సమావేశం ముగిసిందని చైర్పర్సన్ బెల్ కొట్టారు.
దాంతో పాటు ఆమె భర్త, కోఆఫ్షన్ సభ్యుడు దేశం సుధాకర్ రెడ్డి - ఎమ్మెల్యే ప్రసంగం వినాల్సిన అవసరం లేదన్నారు. దీనికి వైయస్సార్ కాంగ్రెసు కౌన్సిలర్లు అభ్యంతరం చెప్పారు. దాంతో గొడవ ప్రారంభమైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కుర్చీలు విసురుకునే స్థాయికి చేరుకుంది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ చాంబర్ల అద్దాలు ధ్వంసమయ్యాయి. అధికార పార్టీ నేతల ఫిర్యాదు మేరకు శాసనసభ్యుడు భూమా నాగిరెడ్డిపై పోలీసులు హత్యాయత్నం, దాడి కేసులు నమోదు చేశారు. అనంతరం అతనిని అరెస్టు చేశారు.