షాక్: భారత్ బంద్ కు వైసీపీ సంపూర్ణ మద్దతు
కడప: పెద్దనోట్లు రూ.1,000, రూ.500 రద్దుకు నిరసనగా సోమవారం (నవంబర్ 28) చేపట్టిన దేశ వ్యాప్త బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కడప శాసన సభ్యుడు అంజద్ బాష చెప్పారు. ఈ బంద్ లో కడప జిల్లా ప్రజలు స్వచ్చందంగా పాల్గొనాలని ఆయన మనవి చేశారు.
కడప శాసన సభ్యుడు అంజద్ బాష మీడియాతో మాట్టాడుతూ నల్లధనం వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి కార్యక్రమాలకైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని భవిష్యత్తులో కూడా మేము సమర్థిస్తామని స్పష్టం చేశారు.
నల్లధనం నిర్మూలించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని మా పార్టీ స్వాగతిస్తుందని శాసన సభ్యుడు అంజద్ బాష అన్నారు. అయితే ఎటువంటి ప్రత్యామ్నయం లేకుండా రూ.1,000, రూ.500 నోట్లు అర్దరాత్రి రద్దు చేయ్యడాన్ని మేము వ్యతిరేకిస్తున్నామని ఆయన చెప్పారు.
ఒక్క సారిగా తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్య ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 18 రోజుల నుంచి సామాన్య ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నా ప్రత్యామ్నాయం ఏర్పాట్లు చేయలేకపోవడం చాల దారుణం అని శాసన సభ్యుడు అంజద్ బాష విచారం వ్యక్తం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నిరసనగా వామపపక్షాలు, ప్రతిపక్ష పార్టీలు చేపట్టిన భారత్ బంద్ కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని ఆయన చెప్పారు. ఈ భారత్ బంద్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు పార్టీ కార్యకర్తలు పాల్గొనాలని కడప శాసన సభ్యుడు అంజద్ బాష పిలుపునిచ్చారు.