'బాబుపై పవన్కళ్యాణ్ యూ టర్న్! ఎన్ని ప్రశ్నలేశావ్'
హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గుడివాడ అమర్నాథ్ శుక్రవారం తీవ్రంగా మండిపడ్డారు. ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. పవన్ రాజధాని ప్రాంతంలో మాట్లాడిన మాటలకు, మీడియా సమావేశానికి ఏమాత్రం పొంతన లేదన్నారు.
రాజధాని ప్రాంతంలో పర్యటన సందర్భంగా తెలుగుదేశం పార్టీ మంత్రులను తిట్టిన పవన్.. హైదరాబాదు వెళ్లాక వైయస్సార్ పైన విమర్శలు గుప్పించారన్నారు. ఈ విమర్శలు చేయడానికి పవన్ ఎంత ప్యాకేజీకి అమ్ముడుపోయారని పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారు.
జనసేన పార్టీ ధనసేన పార్టీగా మారిపోయిందని విమర్శించారు. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎన్ని ప్రశ్నలు వేశారో చెప్పాలని ఎద్దేవా చేశారు. తెర వెనుక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డైలాగ్స్ రాస్తుంటే తెర ముందు పవన్ డైలాగ్స్ చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
పవన్ కళ్యాణ్ పైన జగన్కు చెందిన వెబ్ సైట్లోను విమర్శలు వచ్చాయి. ఎవరిని ప్రశ్నిస్తున్నారో పవన్ చెప్పలేదని, చంద్రబాబు పైన గొంతు పేలవంగా వినిపించారని ఎద్దేవా పేర్కొన్నారు. రైతులకు అన్యాయమంటూనే చంద్రబాబు మంచిగా చేస్తున్నారని చెప్పడాన్ని ప్రశ్నించింది.
అంతేకాదు, రైతుల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తానని.. అదే చంద్రబాబును పదేళ్ల పాటు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నానని చెప్పారని ఇదేం వైఖరని ప్రశ్నించారు. చంద్రబాబు పైన ప్రశంసలు కురిపించడాన్ని నిలదీశారు. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి తాను మీడియా సమావేశం పెట్టలేదని పవన్ చెప్పారని గుర్తు చేశారు. ఆమరణ నిరాహార దీక్ష పైన విలేకరి ప్రశ్నిస్తే సమాధానం దాటవేశారన్నారు.
కాగా, టీడీపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం తన అభిమతం కాదని పవన్ కళ్యాణ్ శుక్రవారం విలేకరుల సమావేశంలో చెప్పారు. అలాంటి నీచ రాజకీయాలు తాను చేయనన్నారు. ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం లేదని, బాధ్యతను గుర్తుచేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజన సరిగా చేయలేదని ధ్వజమెత్తారు. పాలకుల విధానాల్లో లోపం ఉంటే ఆ ప్రభావం రాబోయే తరాలపై పడుతుందన్నారు. 2024 వరకు చంద్రబాబే సీఎంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారితే రైతుల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.