భూమా మృతి-నంద్యాల సీటు ఎవరిది?: అఖిలకు షాక్, బాబుకు జగన్ చెక్
నంద్యాల సీటు తమదేనని, అక్కడ తాము తప్పకుండా పోటీ చేస్తామని వైసిపి అధినేత వైయస్ జగన్ సహా, ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
విజయవాడ: నంద్యాల సీటు తమదేనని, అక్కడ తాము తప్పకుండా పోటీ చేస్తామని వైసిపి అధినేత వైయస్ జగన్ సహా, ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. భూమా నాగిరెడ్డి మృతి నేపథ్యంలో నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరుగుతాయి.
నంద్యాల సీటు తమదేనని, అక్కడ ఉప ఎన్నికల్లో తాము కచ్చితంగా పోటీ చేస్తామని జగన్ ప్రకటించారు. వైసిపి ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వర రెడ్డి కూడా ఇదే చెప్పారు. నంద్యాలలో పోటీ చేస్తామని చెప్పారు.
భూమా నాగిరెడ్డి చేసిన తప్పులు చెప్పాలా!?, అందుకే టిడిపిలోకి: జగన్ షాకింగ్
శోభ మరణించిన రెండేళ్లలోనే భూమా నాగిరెడ్డి మృతి కలచివేసిందన్నారు. భూమా కుటుంబం పడుతున్న బాధలో పాలుపంచుకుంటామన్నారు. అసెంబ్లీ సంతాపం పేరిట జగన్ను, వైసిపిని విమర్శించి వివాదాస్పదం చేశారని మండిపడ్డారు.
తమ పార్టీకి భూమా అందించిన సేవల పట్ల గౌరవం ఉంది కాబట్టే ఏ కుటుంబాన్ని ఆదరించని విధంగా జగన్ ఆదరించారన్నారు. భూమా కుటుంబానికి మూడు అసెంబ్లీ స్థానాలు కేటాయించామన్నారు. నాగిరెడ్డికి పీఏసీ చైర్మన్ ఇచ్చామన్నారు.
శోభా నాగిరెడ్డి మరణించినప్పుడు జగన్, వారి కుటుంబం అందరికంటే ఎక్కువ బధపడిందన్నారు. ఏ సంస్కారంతో చంద్రబాబు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని ప్రశ్నిచారు. ఏ సంస్కారం ఉందని ఫిరాయింపు ఎమ్మెల్యేలతో జగన్పై విమర్శలు చేయిస్తున్నారన్నారు.
నంద్యాలపై పోటీకే సై
2014లో శోభా నాగిరెడ్డి మృతి అనంతరం జరిగిన ఆళ్లగడ్డ ఉప ఎన్నికల్లో టిడిపి పోటీ చేయలేదు. శోభ మృతి తర్వాత ఆమె కుటుంబ సభ్యురాలైన అఖిలప్రియను వైసిపి నిలిపింది. దీంతో టిడిపి, కాంగ్రెస్, ఇతర పార్టీలు బరిలో నిలువలేదు. దీంతో అఖిల ప్రియ ఎన్నిక ఏకగ్రీవం అయింది.
జగన్ కొత్త ట్విస్ట్
భూమా నాగిరెడ్డి 2014లో వైసిపి నుంచి గెలిచారు. ఆ తర్వాత కొద్ది నెలల క్రితం టిడిపిలో చేరారు. రెండు రోజుల క్రితం హఠాత్మరణం పొందారు. ఈ నేపథ్యంలో భూమా గెలిచిన నంద్యాల సీటు తమదేనని, కాబట్టి తాము పోటీలో నిలబెడతామని జగన్ చెబుతున్నారు.
టిడిపి మాత్రం ఆయన తమ పార్టీలో చేరారు కాబట్టి.. ఆయన కుటుంబం నుంచి ఎవరినైనా నిలబెడితే విపక్షాలు పోటీ చేయవద్దని కోరుకుంటున్నాయి.
2014లో భూమా తమ పార్టీ నుంచి పోటీ చేశారని, అలాంటప్పుడు ఆ సీటు తమదే అవుతుందని, భూమా టిడిపిలో చేరినంత మాత్రాన దానిని ఇప్పుడు వదులుకునేది లేదని వైసిపి అభిప్రాయపడుతోంది. అది మా సీటు కాబట్టి తప్పకుండా పోటీ చేస్తామని జగన్ చెబుతున్నారు.