బాలకృష్ణ కూడా: వైసీపీ, టీవీల్లో వేస్తే బాబు క్యారెక్టర్ తెలుస్తుంది: రోజా
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యే రోజా పైన టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలు ఖండించారు. సోమవారం వారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. కళాకారుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టిన పార్టీ టీడీపీ అని, అలాంటి పార్టీలో ఉన్న నాయకులు కళాకారులను అవమానించేలా మాట్లాడటం శోచనీయమన్నారు.
అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ రకమైన ప్రవర్తన మానుకోవాలన్నారు. ఆత్మస్తుతి, పరనింద తరహాలో టీడీపీ నేతలు మాట్లాడుతున్నారన్నారు. సభ్య సమాజం తలదించుకునేలా అధికార పార్టీ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్, బాలకృష్ణలు ఇద్దరు కళాకారులే కదా అని గుర్తు చేషారు. షరతులతో రుణమాఫీ చేస్తామని ఎన్నికలకు ముందు ఎందుకు చెప్పలేదన్నారు.
రోజా ఆగ్రహం
తాను పొద్దున అచ్చెన్నాయుడును అన్నానని గోరంట్ల బుచ్చయ్య తనను అంటున్నారని చెబుతున్నారని, తాను ఎప్పుడో పొద్దున అంటే వారు ఇప్పుడు అనడమేమిటని, రెండు గంటల వరకు నిద్రపోతున్నారా అని రోజా ప్రశ్నించారు. రోజా పైన గోరంట్ల చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. దీని పైన రోజా ఓ చానల్తో ఘాటుగా స్పందించారు.
చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ను గోరంట్ల చదువుతున్నారన్నారు. ఎన్టీఆర్ కళాకారుడు అని, అలాంటి కళాకారుడు పెట్టిన టీడీపీ ద్వారా గోరంట్లకు రాజకీయ భవిష్యత్తు వచ్చిందన్నారు. ఆయనకు తనకు ఎలాంటి గొడవ లేదన్నారు. చంద్రబాబు మెప్పు పొందేందుకే ఆయన మాట్లాడుతున్నారన్నారు.
తాను టీడీపీలో ఉన్నప్పుడు రోజుకో నియోజకవర్గం ఇచ్చి ఓడించారన్నారు. ఈ రోజు ఎంత బలమైన నేతను పెట్టినా తాను వైసీపీ నుండి గెలిచానని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా గెలుపొందడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. తన పైన కేసులు పెట్టడమే కాకుండా, వ్యక్తిగతంగా దూషిస్తున్నారన్నారు.
చంద్రబాబు మాట్లాడుతూ.. దొంగ అంటూ జగన్ను చూపిస్తున్నారని మండిపడ్డారు. మేనిఫెస్టోలో పూర్తి రుణమాఫీ అని చెప్పి ఎందుకు చేయలేదన్నారు. టీడీపీ రోబోలాగా ఉందని, మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారన్నారు. వారి ఇంటి వెనుక నిజాయితీ, ఇంటి ముందు నీతి ఉన్నట్లుగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్ నాడు చంద్రబాబు పైన మాట్లాడిన మాటలు అన్ని టీవీ ఛానళ్లలో టెలికాస్ట్ చేస్తే బాబు క్యారెక్టర్ ఏమిటో తెలుస్తుందన్నారు. నాడు మామను, ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. మంత్రుల్లో కనీసం ఒక్కరికి కూడా సబ్జెక్ట్ లేదన్నారు. ఏ సబ్జెక్ట్ మాట్లాడిన జగన్, వైయస్, మరెవరినో విమర్శించడం తప్ప వారేం చేయడం లేదన్నారు.
వారికి ఇష్యూ లేకనే తమ పైన వ్యక్తిగత దాడికి దిగుతున్నారన్నారు. హుధుద్ తుఫాను, రాజధాని కోసం హుండీలు పెట్టుకొని డబ్బులు అడుక్కున్నారని, మొత్తం డబ్బు దోచుకున్నారని ఆరోపించారు. విజిలెన్స్ దాడుల్లో టీడీపీ నేతల ఇళ్లలో బియ్యం, బంగాళాదుంపలు బయటపడ్డాయని ఆరోపించారు.
హుధుద్ వల్ల ఎంత మంది చనిపోయారో, ఎంత నష్టం జరిగిందనే విషయాలు పక్కన పెట్టి టీడీపీ నేతలు దోచుకున్నారన్నారు. పక్క రాష్ట్రం ఒరిస్సాలో అన్నీ ముందు జాగ్రత్తలు తీసుకున్నారని, చంద్రబాబు ఎందుకు తీసుకోలేదన్నారు. ఏమైనా అంటే చంద్రబాబు టెక్నాలజీ అంటారని, ఏం చేశారని ప్రశ్నించారు.
చంద్రబాబు బస్సులో పడుకున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారని, అదేమైనా ఆర్టీసీ బస్సా అని ప్రశ్నించారు. మరీ భజన చేయడానికైనా హద్దు ఉండాలన్నారు. చంద్రబాబు మారి ఉంటారనో, రుణమాఫీ అన్నందుకో వారు గెలిచారన్నారు. ముప్పయ్యేళ్ల టీడీపీకి 100 సీట్లు వస్తే, మూడేళ్ల తమ పార్టీకి 67 సీట్లు వచ్చాయన్నారు.