సారీ చెప్పండి: ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకు జగన్ నోటీసు, కొడాలి నానికి షాక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మంగళవారం నాడు ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ రాధాకృష్ణ, ఎడిటర్ శ్రీనివాస్లకు లీగల్ నోటీసులు పంపించింది. పదిహేను రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం ఎడిషన్లో ప్రచురించిన ఆర్టికల్ పైన క్షమాపణ చెప్పాలని నోటీసులో ఆ పార్టీ డిమాండ్ చేసింది.
డిసెంబర్ 13, 2014న విశాఖ ఎడిషన్లో ప్రచురించిన కథనం పైన వారం రోజుల్లోపు క్షమాపణ చెప్పాలని పేర్కొంది. లేనిపక్షంలో తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. కథనంలో తమ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగేలా ఉందని ఆ నోటీసులో పేర్కొన్నారు.
కొడాలి నానికి హైకోర్టు ఝలక్
ఆంధ్రప్రదేశ్ డీజీపీ జేవీ రాముడు నియామకాన్ని సవాల్ చేస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ఆగ్రహం కొట్టి వేసింది. ట్రిబ్యునల్ను ఆశ్రయించకుండానే హైకోర్టుకు రావడాన్ని ప్రశ్నించింది. కోర్టు సమయాన్ని ఎందుకు వృథా చేస్తున్నారని ప్రశ్నించింది.
కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా జాస్తి వెంకటరాముడిని నియమించడాన్ని సవాలు చేస్తూ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ప్రకాశ్ సింగ్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు విరుద్ధంగా రాముడి నియామకం జరిగిందన్నారు.
అందువల్ల ఆయన నియామకపు జీవోను నిలిపేసి, రాముడి కన్నా సీనియర్ అధికారికి డీజీపీ బాధ్యతలు అప్పగించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని తన పిటిషన్లో కోరారు. అయితే, ట్రిబ్యూనల్ను ఆశ్రయించకుండా వచ్చారని ఈ పిటిషన్ను ఇప్పుడు కోర్టు కొట్టివేసింది.