మాదే అధికారం, కడపకు వైఎస్సార్ పేరు తొలగించాలి
కడప: వైయస్సార్ కడప జిల్లా పేరును మార్పు చేసి మళ్లీ కడప జిల్లాగానే ఉంచాలని తెలుగుదేశం పార్టీ మినీ మహానాడులో ఆదివారం నాడు తీర్మానం చేశారు. కడప జిల్లా నూతన అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన టీడీపీ మినీ మహానాడు నిర్వహించారు.
ఇందులో ఇంఛార్జ్ మంత్రి గంటా శ్రీనివాస రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కడప జిల్లాలో టీడీపీ కార్యకర్తలు ఎవరూ భయపడాల్సిన పని లేదన్నారు. పాత జమానాలు ఇక చెల్లవని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉందని గుర్తుంచుకోవాలన్నారు.
పాత జమానాలు ఇక చెల్లవన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. చారిత్రక నేపథ్యంలో ఉండి, తిరమల శ్రీనివాసుని తొలి గడపగా పేరు గాంచిన కడప జిల్లాను గత ప్రభుత్వంలో వైయస్సార్ జిల్లాగా పేరు మార్చారన్నారు.
వేర్వేరు జిల్లాలకు చెందిన వారు సీఎంలుగా పని చేసి, వారు మరణించిన తర్వాత ఆ జిల్లాకు వారి పేర్లు పెట్టలేదన్నారు. అలాంటింది కొందరు కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెట్టారని, దీనిని మార్పు చేసి మళ్లీ పాత పేరునే ఉంచాలని తీర్మానం చేశారు.