హోదా ఇవ్వని జైట్లీపై కాకుండా కాంగ్రెస్పై విమర్శలా?: చంద్రబాబుపై కేవీపీ
విజయవాడ: ఏపీకి న్యాయం చేయడం కోసం తన పోరాటం కొనసాగిస్తానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. విజయవాడలో వైయస్ విగ్రహం తొలగింపుపై రగడ కొనసాగుతోంది. బస్టాండ్కు సమీపంలో ఉన్న వైయస్ విగ్రహం తొలగింపుపై సమాచారం అందుకున్న ఆయన శనివారం ఆ ప్రాంతాన్ని సందర్శించారు.
అనంతరం ఫైర్ స్టేషన్లో ఉంచిన వైయస్ విగ్రహన్ని పరిశీలించి నివాళులర్పించారు. అనంతరం మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో తాను వెనుకంజ వేయబోనని చెప్పారు.
విభజన సమయంలో సమైక్య ఆంధ్ర ఉద్యమాన్ని బాగానే నడిపామని చెప్పారు. విభజన జరుగుతున్న సమయంలో నిస్సహాయంగా ఏమీ చేయలేని స్థితిలో చూస్తూ కన్నీళ్లు పెట్టుకుని ఉండిపోవాల్సి వచ్చిందన్నారు. కానీ ఇప్పుడు ప్రజల పక్షాన పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
2021 కల్లా పోలవరం ప్రాజెక్టు నీళ్లు మన రాష్ట్రంలో పారేలా చూసుకుంటామని ఆయన పేర్కొన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలోని చాలా ప్రాంతాలు వెనకబడి ఉన్నాయని వారి ప్రయోజనాలను కాపాడడమే లక్ష్యంగా వారి తరఫున కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు.
ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని రాజ్యసభలో శుక్రవారం జరిగిన చర్చలో అరుణ్ జైట్లీ తేల్చి చెప్పాడని అన్నారు. సభలో జైట్లీ ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వలేమని తేల్చి చెప్పితే, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బీజేపీని నిలదీయాల్సింది పోయి కాంగ్రెస్ విమర్శిస్తున్నాడని మండిపడ్డారు.
తాము ఏపీకి హోదాపై ఎంతో చిత్తశుద్ధితో ఉన్నామని తెలిపారు. చర్చలో భాగంగా కాంగ్రెస్ ఒక్క ప్రత్యేకహోదా గురించే మాట్లాడలేదని, ఏపీ రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాలన్నింటిని గురించి ప్రస్తావించామని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా సభలో పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లులోని పలు అంశాల్ని మీడియాకి చదివి వినిపించారు.
ఏపీకి ప్రత్యేకహోదా కోరుతూ తాను ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టిన సమయంలో చాలా మంది హెచ్చరించారని తెలిపారు. అయినప్పటికీ తాను రాజ్యసటు గురించి లెక్కచేయకుండా, తన ఆరోగ్యాన్ని కూడా లెక్కచేయకుండా ఏపీ ప్రజల ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పారు.
విజయవాడలో వైయస్ విగ్రహాన్ని తొలగించడంపై కూడా ఆయన స్పందించారు. వినాసకాలే విపరీత బుద్ధి అనే సామెతను చెప్పి చంద్రబాబుపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఐదు లక్షల మెజారిటీ గెలిచాననే అహంకారంతో వ్వవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
కోట్లాది ప్రజలు ఆరాధ్య దైవమైన వైయస్ విగ్రహాన్ని తొలగించి ఒక ఫైర్ స్టేషన్లో ముసుగేసి పెట్టినంత మాత్రాన రైతుల గుండెల్లో నుంచి ఆయన్ను ఎవరూ తొలగించలేరని పేర్కొన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేనటుంటి సంక్షేమ పథకాలను వైయస్ ప్రజల కోసం తీసుకొచ్చారని అన్నారు.