నేరస్థుడే: హోదాపై మోడీని టార్గెట్ చేసిన జగన్, బాబు సీఎంగా అనర్హుడు
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఐదు కోట్ల మంది తెలుగు ప్రజలను మోసగిస్తున్నందుకు బీజేపీయే ముద్దాయి అని, హోదా ఇవ్వని ప్రధాని నరేంద్ర మోడీ నేరస్తుడేనని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గురువారం నాడు వ్యాఖ్యానించింది.
ప్రత్యేక హోదా కోసం కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చటేయకుండా, పోరాడనని చెబుతున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా దోషి అన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషం కూడా అర్హులు కాదని మండిపడ్డారు.
మరోవైపు, పార్టీ కార్యాలయంలో వైసిపి నేత భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ... హోదా ఇవ్వాలని మోడీకి ఉంటే వెంటనే ప్రకటించే అవకాశముందని చెప్పారు. హోదా తేవాలనే చిత్తశుద్ధి ఉంటే చంద్రబాబు ఒత్తిడి కూడా చేసే వారన్నారు.
రాజ్యసభలో ప్రయివేటు బిల్లుపై చర్చతో ఉపయోగం లేదన్నారు. కావాల్సినదంతా రాజకీయ సంకల్పం, ఆ సంకల్పం మోడీకి, చంద్రబాబుకు లేనందువల్లే ఏపీకి హోదా రావడం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రాన్ని అరాచకంగా విభజించి, కాంగ్రెస్ పార్టీ శవంగా మార్చిందన్నారు.
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా బిల్లును పెట్టలేమని కేంద్రమంత్రి వెంకయ్య గురువారం రాజ్యసభలో తేల్చేసిన విషయం తెలిసిందే. గురువారం సభలో బిల్లుపై చర్చ జరిగింది. శుక్రవారం అరుణ్ జైట్లీ వివరణ ఇవ్వనున్నారు. చర్చలో భాగంగా బిల్లు ఎప్పుడు పెడతారో చెప్పాలని కేవీపీ నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని టిడిపి నేతలు డిమాండ్ చేశారు.