ప్రకాశం ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరించిన జగన్ పార్టీ
హైదరాబాద్: ప్రకాశం జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికలను వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బహిష్కరించాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని పార్టీ ఒంగోలు పార్లమెంటు సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాస రెడ్డి మంగళవారంనాడు ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ అక్రమాలను నిరసిస్తూ తాము ఎమ్మెల్సీ ఎన్నికలను బహష్కరిస్తున్నట్లు వారు తెలిపారు అధికార తెలుగుదేశం పార్టీ అక్రమాలపై తాము ఎవరికీ చెప్పినా తమకు న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కమిషనర్కు, గవర్నర్కు తాము ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వారన్నారు.
కోట్ల రూపాయలు వెదజల్లి ఎంపిటిసీ సభ్యులను తెలుగుదేశం పార్టీ కొనుగోలు చేసిందని, తద్వారా ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేసిందని వారు విమ్రశించారు. తెలుగుదేశం పార్టీ కుట్ర రాజకీయాలకు ప్రజలే బుద్ధి చెప్తారని వారన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా లేకపోవడం వల్ల తాము వాటిని బహిష్కరిస్తున్నట్లు వారు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం, కర్నూలు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలకు పోలింగ్ అనివార్యంగా మారిన విషయం తెలిసిందే.