'అసెంబ్లీ సాక్షిగా ఎన్టీఆర్ను తూలనాడిన ఆయనా ఇప్పుడు మాట్లాడేది'
అమరావతి: టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ మాహానుభావుడని, ఆ విషయం అందరికి తెలుసని వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. శనివారం ఆయన వైసీపీ పార్టీ ఆఫీసులో పార్టీకి చెందిన ఇతర సీనియర్ నేతలు బొత్స సత్యనారాయణ, గడికోట శ్రీకాంత్రెడ్డిలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. గతంలో అసెంబ్లీ సాక్షిగా ఎన్టీఆర్ను తూలనాడిన చంద్రబాబు ఇప్పుడు మహానాడులో ఎన్టీఆర్ గురించి గొప్పగా చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. చంద్రబాబు తన రెండేళ్ల పాలనలో ఏపీకి చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
అందుకే లేనిది ఉన్నట్లుగా, ఉన్నది లేనట్లుగా చెప్పి ప్రజలను భ్రమల్లోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. మహానాడులో ఎప్పడైనా ప్రజల సమస్యల గురించి చర్చించారా? అని ప్రశ్నించారు. తన రెండేళ్ల పాలనలో చంద్రబాబు అవినీతిని వ్యవస్థీకరించారని, రాజ్యాంగ విరుద్ధమైన కమిటీలు వేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
కమీషన్లకు కక్కుర్తి పడే పోలవరం ప్రాజెక్టును పక్కన పెట్టి పట్టిసీమను కట్టారని విమర్శించారు. ఐదు నెలలుగా ఆరోగ్యశ్రీ డబ్బులు అందడం లేదని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు. ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయన్నారు.
ఇలాంటి సమస్యలను పట్టించుకోకుండా, ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. నదులను అనుసంధానం చేశానంటున్న చంద్రబాబును చూసి ఇరిగేషన్ నిపుణులు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులకు మళ్లీ వడ్డీలకు అప్పులు తెచ్చుకునే దుస్థితిని కల్పించారన్నారు.
ఒక్క హామీని నేరవెర్చలేదు: బొత్స
ఏపీ సీఎం చంద్రబాబు తన రెండేళ్ల పాలనా కాలంలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీలు నెరవేర్చని చంద్రబాబుపై జూన్ 2వ తేదీన చీటింగ్ కేసులు పెట్టాలని నిర్ణయించామని చెప్పారు. చంద్రబాబు పంచభూతాలను కూడా వదలకుండా తినేస్తున్నారని ఆయన అన్నారు.