ఎందుకొచ్చావ్, నీలాంటోడ్ని చూల్లేదు: పవన్ కళ్యాణ్పై వైసిపి నేత తీవ్రవ్యాఖ్యలు
రాజమహేంద్రవరం: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బుధవారం సాయంత్రం రాజమహేంద్రవరంలో విలేకరులతో మాట్లాడారు.
పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి ఎందుకు వచ్చారో, పార్టీ పెట్టి ఎవరిని ఉద్దరించారో, ఏం చేయాలనుకుంటున్నారో తెలియదని వ్యాఖ్యానించారు. ఓసారి రాజకీయాలలోకి వస్తానని చెబుతారని, మరోసారి పార్టీని నడపడానికి డబ్బులు లేవంటారని, రాజకీయాల్లో ఇంత అయోమయం ఉన్న వ్యక్తిని ఇంత వరకు చూడలేదన్నారు.
సాధారణ ఎన్నికల సమయంలో పవన్ టిడిపి - బీజేపీ కూటమి తరపున హామీ ఇస్తూ ప్రచారం చేశారని, కాబట్టి ఎన్నికల హామీలలో ఆయన బాధ్యత కూడా ఉంటుందన్నారు. రెండేళ్ళు పూర్తయినా టిడిపి - బీజేపీ ప్రభుత్వాలు తమ హామీలను నిలబెట్టుకోలేదన్నారు.
సీఎం చంద్రబాబు ఎన్నికలలో గెలిచేందుకు రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి.. ఇలా ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని నెరవేర్చడం లేదన్నారు. ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. ఏడాదికో, ఆర్నెల్లకో ఓసారి కనిపించి పవన్ మాయమవుతారని, అంతేకానీ ప్రజల చంద్రబాబును ప్రశ్నించడం లేదన్నారు.
పవన్ మాటలు నమ్మి కాపు యువత టిడిపికి ఓటు వేసి గెలిపిస్తే.. వారిద్దరు ఇప్పుడు మోసం చేస్తున్నారన్నారు. పవన్ దగ్గర పార్టీని నడిపించడానికి డబ్బు లేకపోయినా, టిడిపి - బీజేపీలను ప్రజల తరపున నిలదీయడానికి డబ్బులు అవసరం లేదన్నారు.
ప్రత్యేక హోదా కోసం ఆయన స్వయంగా పోరాటం చేయలేకపోయినా, దాని కోసం పోరాడుతున్న వారికి తన మద్దతు ప్రకటించడానికీ డబ్బులు అవసరం లేదన్నారు. ఆయన దేశ సమస్యలన్నిటి గురించి మోడీ ప్రభుత్వాన్ని నిలదీయనవసరం లేదన్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రశ్నిస్తే చాలన్నారు.
జనసేన పార్టీ పెట్టిన కొత్తలో ఆయనలో కనబడిన ఉత్సాహం, రాజకీయాలపై ఆసక్తి, సమాజానికి ఏదో చేయాలనే తపన, ఎవరినైనా నిలదీయగల తెగువ, ధైర్య సాహసాలు వంటివన్నీ ఇప్పుడు కనిపించడం లేదన్నారు. ఇప్పటికైనా పవన్ ప్రజా సమస్యలపై స్పందిస్తే బాగుంటుందన్నారు. ప్రజల నమ్మకం పోగొట్టుకున్నాక 2019 ఎన్నికలలో ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చినా అప్పుడు ఆయన మాటలు ఎవరూ నమ్మరన్నారు.