'టీడీపీకి ఏ గతి పట్టిందో చూశాం': సాయిరెడ్డిని పోటీలో నిలబెట్టడానికి కారణం ఇదీ
అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో ఒక అభ్యర్ధిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలం కంటే ఎక్కువ ఎమ్మెల్యేలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. అందుకే వైసీపీ తరుపున విజయసాయి రెడ్డిని పోటీలో నిలబెట్టామని ఆయన వెల్లడించారు.
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, విజయసాయిరెడ్డి సోమవారం హైదరాబాద్లో ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ను కలిశారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి ఫిరాయింపు రాజకీయాలపై భన్వర్లాల్కు ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమ్మారెడ్డి వైసీపీకి సరిపోయే సంఖ్యా బలం ఉండబట్టే రాజ్యసభ బరిలో పోటీ చేస్తున్నామని చెప్పారు.
సంఖ్యాబలం లేకుండా తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన టీడీపీకి ఏ గతి పట్టిందో అందిరికీ తెలుసని ఆయన అన్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు అనైతిక రాజకీయాలకు పాల్పడుతున్నారని అన్నారు. నాలుగో అభ్యర్ధిని నిలబెట్టేందుకు సరిపోయే సంఖ్యాబలం లేకపోయినా టీడీపీ పోటీ చేయడం అనైతికమన్నారు.
ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు సమాలోచనలు
వైసీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సోమవారం విజయవాడలో భేటీ అయ్యారు. నిజానికి టీడీపీ సంఖ్యా బలం మూడు రాజ్యసభ సీట్లు గెల్చుకోవడానికే సరిపోతుంది. కానీ, నాలుగు సీట్లకు అభ్యర్థులను నిలుపనున్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే టీడీపీకి వచ్చే మూడు సీట్లలో ఒక సీటుని బీజేపీకి కేటాయించిన చంద్రబాబు నాయుడు, మిగిలిన రెండు సీట్లలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్లను ఖరారు చేసింది. నాల్గవ సీటు విషయమై విజయవాడలోని క్యాంప్ కార్యాలయంలో ఈ సమావేశం జరుగుతోంది.
నాలుగో అభ్యర్ధిని గెలిపించుకునే బలం లేకపోయినా టీడీపీ మాత్రం పోటీకి సిద్ధం అవుతోంది. తెలంగాణలో ఓటుకు నోటు తరహాలో వ్యూహాన్ని సిద్ధం చేసే పనిలో పడ్డారు. సీఎం అధికార నివాసంలోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ అయ్యారు.