అవమానకర వ్యాఖ్యలు: వైసిపి, నాపై జగన్ అప్పటి నుంచి కక్ష: ఆదినారాయణ రెడ్డి
ఎస్సీలను ఉద్దేశించి మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఆదివారం ఆయన పర్యటించారు.
జమ్మలమడుగు: ఎస్సీలను ఉద్దేశించి మంత్రి ఆదినారాయణ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో ఆదివారం ఆయన పర్యటించారు.
దళితులపై సంచలన వ్యాఖ్యలు ఇలా..
ఈ సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు. దళితులు శుభ్రంగా ఉండరని, సరిగ్గా చదువు రాదని, కానీ వాళ్లే సూపరింటెండెంట్లు అయిపోతారని, ఏదో వెనుకబడ్డారని అప్పట్లో పదేళ్లు అంబేడ్కర్ వల్ల రిజర్వేషన్లు వచ్చాయని, కానీ 70 ఏళ్లు పూర్తయినా ఇంకా రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని, ఎన్ని వసతులు కల్పించినా ఎస్సీలు మారలేదని, ఇంకా వెనుకబడ్డారంటే అందుకు కారణం వాళ్లేనని వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి.
Recommended Video
ఆదినారాయణ రెడ్డిని కఠినంగా శిక్షించాలి
ఎస్సీలను ఉద్దేశించి మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయనను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని వైసిపి నేతలు ఆదిమూలపు సురేష్, నారాయణ స్వామి, సురేష్ కుమార్లు మండిపడ్డారు. భవిష్యత్తులో ఎవరూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఆదిని కఠినంగా శిక్షించాలన్నారు.
నోటికి హద్దు లేకుండా
ఎస్సీలకు రాజ్యాంగంలో పదేళ్లు మాత్రమే రిజర్వేషన్ ఇస్తే డెబ్బై ఏళ్లయినా మారలేదని, ఎస్సీల వెనుకబాటుకు వారే కారణమని, వారికి ఎంతో మేలు చేయాలని ఆలోచించినా ఎస్సీలు చదవరని, శుభ్రంగా ఉండరని, ఎస్సీ చేతిలో పట్టా భూమి ఉండదని వ్యాఖ్యానించారంటూ ఆది నోటికి హద్దు లేకుండా మాట్లాడారన్నారు.
ఆదినారాయణ రెడ్డి వివరణ
దళితుల మేలు కోసం చెప్పిన మాటలను సాక్షి, వైసిపి వక్రీకరిస్తుందని మంత్రి ఆదినారాయణ రెడ్డి వివరణ ఇచ్చారు. దళితులను ఎప్పుడూ గౌరవిస్తుంటానని స్పష్టం చేశారు. శుభ్రత ప్రధానమని సాధారణంగానే చెప్పానన్నారు. తాను చెప్పిన దానిలో దళితులకు వ్యతిరేకంగా మాట్లాడినట్లు వక్రీకరించారన్నారు.
నంద్యాల ఉపఎన్నిక భయంతో
నంద్యాల ఎన్నికల ఓటమి భయంతో వైసిపి దిక్కుతోచని పరిస్థితికి వెళ్లిందని ఆదినారాయణఎద్దేవా చేశారు. ముఖ్యమైన నేతలను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్నారన్నారు.
కడప ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాతే కక్ష
కడప ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి తర్వాత జగన్ తనపై వ్యక్తిగతంగా కక్ష పెంచుకున్నారని ఆదినారాయణ అన్నారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిడిపి తరఫున బిటెక్ రవి గెలిచిన విషయం తెలిసిందే. కాగా, నంద్యాలలో క్రియాశీలకంగా వ్యవహరిస్తుండటంతో దుమారాన్ని రేపారని ఆది అన్నారు. కడపలో తన ఇల్లు దళితవాడలోనే ఉందని చెప్పారు.