గల్లా జయదేవ్పై యువనేత పోటీ, గుంటూరుపై ఫిక్స్ చేసిన జగన్?
వచ్చే ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లిన చోట ఇతర నేతలను ఇంచార్జులుగా రంగంలోకి దింపారు.
గుంటూరు: వచ్చే ఎన్నికల నాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది. ఎమ్మెల్యేలు టిడిపిలోకి వెళ్లిన చోట ఇతర నేతలను ఇంచార్జులుగా రంగంలోకి దింపారు.
తాజాగా, గుంటూరు పార్లమెంటు అభ్యర్థిని జగన్ ఇప్పటికే ఖరారు చేశారని తెలుస్తోంది. టిడిపి అక్కడ ఎమ్మెల్యేల చరిష్మా, అసంతృప్తి, నియోజకవర్గాల పునర్విభజన తదితరాలను పరిగణలోకి తీసుకొని లెక్కలు వేసుకోనుంది.
యువనేతకు సీటివ్వాలని..
వైసిపి మాత్రం అప్పుడే గుంటూరు నుంచి 2019లో పోటీ చేసే అభ్యర్థిని దాదాపు నిర్ణయించారని అంటున్నారు. ఓ యువనేతకు ఈ సీటును ఫిక్స్ చేశారనే ప్రచారం సాగుతోంది.
కృష్ణ దేవరాయ పోటీ చేసే అవకాశం
విజ్ఞాన్ విద్యా సంస్థల అధినేత లావు రత్తయ్య తనయుడు కృష్ణదేవరాయను వచ్చే ఎన్నికల్లో గుంటూరు నుంచి వైసిపి తరఫున పోటీ చేయించనున్నారని తెలుస్తోంది.
జగన్ అంటే అభిమానం
కృష్ణ దేవరాయకు జగన్ అంటే వల్లమాలిన అభిమానం. వచ్చే ఎన్నికల్లో ఒకవేళ తనకు టిక్కెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైసిపి కోసం, జగన్ కోసం పని చేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను జగన్ కన్ఫర్మ్ చేశారని తెలుస్తోంది.
పోటీలో బాలశౌరి
కృష్ణ దేవరాయ గుంటూరు జిల్లాలో వైసిపి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా ఉంటున్నారట. స్థానిక నేతలు కూడా ఎక్కువ మంది కృష్ణదేవరాయలతో కలిసి పని చేసేందుకు సుముఖంగా ఉన్నారని అంటున్నారు. అయితే ఇక్కడి నుంచి బాలశౌరి ప్రధానంగా రేసులో ఉన్నారు. ప్రస్తుతం గుంటూరు ఎంపీగా టిడిపి నేత గల్లా జయదేవ్ ఉన్నారు.