రాయలసీమ చిచ్చు: శ్రీశైలంపై అస్త్రాలు సంధించిన జగన్ పార్టీ ఎమ్మెల్యే
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ చిచ్చు రగులుతున్నట్లే కనిపిస్తోంది. శ్రీశైలం జలాశయం విషయంలో వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కర్నూలు శానసశభ్యుడు ఎస్వీ మోహన్ రెడ్డి తీవ్రమైన విమర్శలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు కలిసి శ్రీశైలం జలాశయాన్ని ఎండిపోయే స్థితికి తెచ్చారని ఆయన మండిపడ్డారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం 800 అడుగులకు పడిపోయిందని ఆయన మంగళవారం మీడియా సమావేశంలో అన్నారు.
గత పదేళ్లలో ఎన్నడూ ఇలా జరగలేదని ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు, కెసిఆర్ కలిసి నీళ్లు ఎడాపెడా వాడుతున్నారని, ఆ నీటిని జల విద్యుదుత్పత్తికే వాడుతున్నారని ఆయన చెప్పారు. రాయలసీమను ఎడారిగా మార్చే కుట్ర జరుగుతోందని ఆయన అన్నారు.
ఇతర దేశాల్లో ఇలా వ్యవహరిస్తే ప్రాసిక్యూట్ చేసి జైలుకు పంపించేవారని ఆయన అన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులు తక్షణమే స్పందించి రాయలసీమను ఆదుకోవాలని ఆయన కోరారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని ఆయన విమర్సించారు.
రాయలసీమ నిధులతో మిగిలిన ప్రాంతాలను చంద్రబాబు అభివృద్ధి చేస్తున్నారని ఆయన అన్నారు. ఎర్రచందనం అమ్మకాల ద్వారా వచ్చిన డబ్బులను రాయలసీమకే ఖర్చు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రాయలసీమకు అన్యాయం జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం అవసరమైతే అన్ని పార్టీలతో కలిసి పనిచేస్తామని ఆయన చెప్పారు. రాయలసీమ పట్ల చంద్రబాబు కపట ప్రేమను ప్రజలు పట్టించుకోవడం లేదని ఆన అన్నారు