మంత్రి యనమల స్కెచ్: వైసీపీ ఎమ్మెల్యేలపై చర్యలకు ప్రభుత్వం సిద్ధం?
అమరావతి: ఏపీ వర్షాకాల సమావేశాలు జరిగిన తీరుపై చర్చించేందుకు ఏపీ శాసనసభ ప్రివిలేజ్ కమిటీ శుక్రవారం హైదరాబాద్లో సమావేశమైంది. ఐదు రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినా ప్రతిపక్షాల ఆందోళనలతో రెండు రోజులకే అర్ధాంతరంగా ముగిసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై చర్చించారు. 45 రోజుల్లో స్పీకర్కు నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు.
అసెంబ్లీలో జరిగిన తీరుపై తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నిందని అన్నారు. అందులో భాగంగానే శాసనసభా వ్యవహారాల మంత్రి యనమల రామకృష్ణుడు తీర్మానం ప్రవేశపెట్టారని, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించిందని తెలిపారు.
అసెంబ్లీ సమావేశాల్లో సభ్యులను సస్పెండ్ చేశాకే సభలోకి మార్షల్స్ రావాలని, అయితే మార్షల్స్తోనే సభను నడపాలని ప్రభుత్వం యత్నించిందని ఆయన అన్నారు. స్పీకర్, గవర్నర్పై దాడి చేసిన చరిత్ర టీడీపీ నేతలదని, ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి దించాక ఆయనకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదని ఈ సందర్భంగా పెద్దిరెడ్డి గుర్తు చేశారు.
ఎన్టీఆర్ను గద్దె దించడంలో మంత్రి యనమల పాత్ర కూడా ఉందని అన్నారు. తాము రెండేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని, అదే అంశంపై సభలో చర్చకు పట్టుబట్టామని అన్నారు. అసెంబ్లీలో తాము ఎవరిపైనా దరుసుగా ప్రవర్తించలేదని, ఎమ్మెల్యేలెవరిపైనా చర్యలు తీసుకోవద్దని సమావేశంలో కోరినట్లు ఆయన పేర్కొన్నారు.