అరచేతిలో వైకుంఠం, మరో నాలుగేళ్లు: రవీంద్రనాధ్
అమరావతి: తెలుగుదేశం పార్టీ పాలనపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ఏడాది పాలనతో ప్రజలంతా విసిగిపోయారని అన్నారు. రైతు రుణాలు, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామంటూ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపి టీడీపీ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అదే ప్రజలకు చుక్కలు చూపెడుతోందని ధ్వజమెత్తారు.
ఈ ప్రభుత్వాన్ని మరో నాలుగేళ్ల పాటు ప్రజలు మోయాల్సిన పరిస్ధితి రావడం ఎంతో బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో జగన్ చేపట్టనున్న 'సమరదీక్ష' పోస్టర్ను విడుదల చేసి సందర్భంగా పై వ్యాఖ్యలు చేశారు.
నవనిర్మాణ దీక్షలో చంద్రబాబు: మంత్రి ఉమా
ఏపీ రాజధానిలో జూన్ 2న ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అదే రోజు ఉదయం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో సీఎం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించనున్నట్లు తెలిపారు. ఇక విజయవాడలో సీఎం క్యాంప్ ఆఫీసు కార్యాలయంగా జలవనరుల శాఖ బిల్డింగ్ని సిద్ధం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.