బాబు గేమ్: 'ఒత్తిడి తట్టుకోలేక ఏపీలోనూ టిడిపి ఖాళీ, జగన్తో 4గురు టచ్లో'
గుంటూరు: తాము తెలుగుదేశం పార్టీలో చేరుతామని వస్తున్న వార్తల పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు శుక్రవారం నాడు మరోసారి స్పందించారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఆడుతున్నారని, తామెవరమూ టిడిపిలో చేరడం లేదని వారు స్పష్టం చేశారు.
తమ పైన ఏపీలో దుష్ప్రచారం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో తెలుగుదేశం ఖాళీ అవుతోందని, అలాగే ఏపీలోని ఖాళీ కావడం ఖాయమని చెప్పారు. చంద్రబాబు ఒత్తిడి తట్టుకోలేక ఏపీ టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
తెలుగుదేశం పార్టీలోకి వెళ్లేందుకు తమ పార్టీకి చెందిన శాసన సభ్యులకు ఎవరికీ ఆసక్తి లేదని చెప్పారు. వైసిపి ఎమ్మెల్యేలు గుంటూరులో శుక్రవారం నాడు మాట్లాడారు. తాము అధికార పార్టీలో చేరుతున్న వార్తలను తీవ్రంగా ఖండించారు.
కాగా, తెలంగాణలో రాష్ట్రంలో టిడిపి చావుదెబ్బ తిన్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి చెందిన పదిహేను మంది ఎమ్మెల్యేల్లో... ఈ ఇరవై నెలల్లో 10మంది కారు ఎక్కారు. దీనిపై వైసిపి నేతలు గురువారమే స్పందించారు. శుక్రవారం మరోమారు మాట్లాడారు.
చంద్రబాబు మైండ్ గేమ్ ప్రారంభించారని వారు గురువారం ఆరోపించారు. పార్టీ మారుతున్నట్లు గాలి వార్తలు రాయించడంతో పాటు టీవీ చానళ్లలో కూడా ప్రకటనలు ఇప్పించడం విడ్డూరమన్నారు. తాము పార్టీ మారేది లేదని స్పష్టం చేశారు.
టిడిపికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని వైసిపి ఎమ్మెల్యేలు చెప్పారు. వారు ఏ క్షణమైనా తమ పార్టీలోకి రావొచ్చని చెప్పారు. టిడిపి ఎమ్మెల్యేలను చూస్తేనే ప్రజలు ఈసడించుకుంటున్నారన్నారు. గడిచిన రెండేళ్లలో టిడిపి ఒక్క మంచి పని చేయలేదన్నారు.
కొన్ని మీడియా సంస్థలు కావాలనే తమ పైన దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు. తెలంగాణలో టిడిపి పని అయిపోవడంతో ఏపీలో కుయుక్తులు పన్నుతున్నారన్నారు. తమ పైన తప్పుడు ప్రచారం చేసే మీడియా సంస్థలకు లీగల్ నోటీసులు ఇస్తామన్నారు.
నలుగురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని, వారు మా పార్టీలోకి వచ్చే అవకాశముందన్నారు. శుక్రవారం మాట్లాడిన వైసిపి ఎమ్మెల్యేల్లో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆర్కే, ముస్తఫా, కోన రఘుపతి, గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.