వైసీపీ వాకౌట్: సబ్సిడీ ఎగ్గొట్టారు, అగ్రిగోల్డ్తో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారు!
అగ్రిగోల్డ్ ద్వారా నష్టపోయిన కుటుంబాలు 30లక్షలు ఉన్నాయని, 105మంది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని వైసీపీ అన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారని ఈ సందర్బంగా వ
అమరావతి: రైతులకు ఇచ్చే ఇన్ పుట్ సబ్సిడీ విషయంలో ప్రభుత్వ వ్యవహరిస్తున్న తీరును వైసీపీ అధినేత జగన్ తప్పుపట్టారు. రూ.6400కోట్లు ఇన్ పుట్ సబ్సిడీని ప్రభుత్వం ఎగ్గొట్టిందని జగన్ ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన నిధులు వచ్చినప్పటికీ.. ప్రభుత్వం మాత్రం నిధులు ఎగ్గొట్టిందన్నారు.
సర్కార్ తీరును నిరసిస్తూ వైసీపీ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. కాగా, జగన్ చేసిన ఆరోపణలను టీడీపీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.1546కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చామని అన్నారు.
అంతకుముందు:
అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే అగ్రిగోల్డ్ వ్యవహారంపై వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతివ్వకపోవడంతో పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ప్రతిపక్షం ఆందోళనలతో స్పీకర్ సభను పది నిమిషాలు వాయిదా వేశారు.
అగ్రిగోల్డ్ విషయంలో వైసీపీ తీరును అధికార పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు. నోటీసు ఇవ్వకుండా వైసీపీ చర్చకు పట్టుబట్టడం అనైతికమని ప్రభుత్వ చీఫ్ కాల్వశ్రీనివాసులు పేర్కొన్నారు.
వైసీపీ రాజకీయం చేస్తున్నారు:
మరో టీడీపీ ఎమ్మెల్యే కూనం రవికుమార్ వైసీపీ తీరును తప్పుబడుతూ.. ప్రశ్నోత్తరాల సమయాన్ని వృథా చేయవద్దని మండిపడ్డారు. అగ్రిగోల్డ్ వ్యవహారాన్ని ప్రతిపక్షం రాజకీయం చేయాలనుకుంటోందని ఆరోపించారు. మరో ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ వ్యవహారమంతా హైకోర్టు పర్యవేక్షిస్తోందని, నిష్పక్షపాతంగా విచారణ జరుగుతోందన్నారు. ప్రతిపక్ష వైసీపీ కావాలనే అగ్రిగోల్డ్ బాధితులను రెచ్చగొడుతుందని ఎమ్మెల్యే బోండా ఉమా ఆరోపించారు.
మీడియా పాయింట్ వద్ద:
స్పీకర్ సభను వాయిదా వేసిన అనంతరం వైసీపీ సభ్యులు మీడియా పాయింట్ వద్ద అగ్రిగోల్డ్ అంశంపై మాట్లాడారు. అగ్రిగోల్డ్ ఆస్తులను కాజేసేందుకు కొంతమంది ప్రభుత్వ పెద్దలు ప్రయత్నిస్తున్నారని అన్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి ధర్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్, సునీల్కుమార్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కు:
అగ్రిగోల్డ్ ద్వారా నష్టపోయిన కుటుంబాలు 30లక్షలు ఉన్నాయని, 105మంది ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. అగ్రిగోల్డ్ యాజమాన్యంతో ప్రభుత్వ పెద్దలు కుమ్మక్కయ్యారని ఈ సందర్బంగా వారు ఆరోపించారు. కుమ్మక్కవడం వల్లే అసెంబ్లీలో దీనిపై చర్చను అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేశారు. సీఎం కుమారుడు లోకేష్ కు అగ్రిగోల్డ్ వ్యవహారంతో సంబంధం ఉందన్న ఆరోపణలపై వివరణ ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.