శ్రీశైలంపై జగన్ పార్టీ టీ ఎంపీ, కేసీఆర్తో హరీష్ చర్చలు
హైదరాబాద్: విద్యుత్ విషయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ లబ్ధి కోసం ప్రయత్నిస్తున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ విషయంలో జోక్యం చేసుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
రైతుల ఆత్మహత్యలు, ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు నష్టపరిహారం చెల్లించాలన్నారు. వచ్చె నెల 9న రంగారెడ్డి, 13న మహబూబ్ నగర్, 17న నల్గొండ జిల్లాల్లో విస్తృతస్థాయి సమావేశాలు ఉంటాయని తెలిపారు.
కేసీఆర్తో మంత్రి హరీష్రావు భేటీ
శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు యోచిస్తున్న తెలంగాణ ప్రభుత్వం అందుకు అనుగుణంగా పావులు కదుపుతోంది. దీనిపై చర్చించేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీష్ రావు ఆదివారం తెలంగాణ సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ నెల 29న కృష్ణా రివర్బోర్డు సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున వినిపించాల్సిన వాదనపై చర్చలు జరిపారు. కోర్టుకు వెళ్లే అంశంపై మంతనాలు జరిపారు.
30న ఢిల్లీకి తెలంగాణ టీడీపీ బృందం
తెలంగాణలో విద్యుత్ సరఫరా మెరుగుపరిచి ఈ ప్రాంత రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ అక్టోబర్ 30న తెలంగాణ తెలుగుదేశం ప్రతినిధి బృందం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తదితర ప్రముఖులకు వినతిపత్రాలు అందించనున్నట్టు టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోయి తీవ్రంగా నష్టపోయిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నప్పటికీ.. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని విమర్శించారు. విద్యుత్ సరఫరా పెంచడానికి కేంద్రం నుంచి తగిన సాయం అందించాలని కోరుతూ రాష్ట్రపతి, ప్రధానితో పాటు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రిని కలిసి వినతి పత్రాలు అందించనున్నట్టు పేర్కొన్నారు.