'సస్పెన్షన్' ప్రభుత్వ కుట్రే, రోజాపై బాబుకు ఎందుకింత కక్ష?: వైవీ సుబ్బారెడ్డి
రోజా సస్పెన్షన్ పై న్యాయపోరాటం చేస్తామని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
ఒంగోలు: ఎమ్మెల్యే రోజా పట్ల అధికార టీడీపీ వ్యవహరిస్తున్న తీరుపై వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మండిపడ్డారు. రోజాపై చంద్రబాబుకు ఎందుకింత కక్ష పెంచుకుందని ఆయన గట్టిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యే రోజాను మరో ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రివిలేజ్ కమిటీ సిఫార్సు చేసిన నేపథ్యంలో వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటికే రోజాను ఏడాది పాటు అసెంబ్లీకి దూరం చేసిన ప్రభుత్వం మరోసారి కుట్రకు తెరలేపుతుందని మండిపడ్డారు. రోజా సస్పెన్షన్ పై న్యాయపోరాటం చేస్తామని సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. అదే సమయంలో సీఎం చంద్రబాబు పాలనను ఆయన దుయ్యబట్టారు. కేంద్ర జీడీపీ కంటే రాష్ట్ర జీడీపీ ఎక్కువగా ఉందని చంద్రబాబు చెప్పడం ఆయన దిగుజారుడుతనానికి నిదర్శనమని అన్నారు.
ఓవైపు 2018నాటికి వెలిగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెబుతోన్న సీఎం.. ప్రాజెక్టు పూర్తవడానికి రూ.2800కోట్లు అవసరమని చెబుతూనే బడ్జెట్ లో రూ.200కోట్లే కేటాయించడమేంటని ప్రశ్నించారు. బడ్జెట్ సాక్షిగా చంద్రబాబు ప్రత్యేక హోదా అంశాన్ని సమాధి చేసేశారని సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉంటే, వైసీపీ ఎమ్మెల్యే రోజాపై ఇదివరకే ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. కాల్ మనీ సెక్స్ రాకెట్ విషయంలో అసెంబ్లీలో రోజా వ్యవహరించిన తీరుపై అప్పట్లో ఆమెను ఏడాది పాటు సస్పెండ్ చేశారు.
ఇక తాజాగా మరోసారి రోజాపై సస్పెన్షన్ కు ప్రివిలేజ్ కమిటీ సిద్దమవడం చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత గొల్లపల్లి సూర్యారావు అధ్యక్షతన ఏర్పాటైన ప్రివిలేజ్ కమిటీ మార్చి 4న సమావేశమై రూపొందించిన నివేదికను గురువారం శాసనసభకు అందజేశారు.