ముగ్గురు మంత్రులకు జగన్ పార్టీ షాక్, డోర్ వద్దే అడ్డుకున్నారు
పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఆక్వా పరిశ్రమలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రులను వైయస్సార్ కాంగ్రెస్, సీపీఎం నేతలు అడ్డుకున్నారు.
నరసాపురం: పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు ఆక్వా పరిశ్రమలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చిన మంత్రులను వైయస్సార్ కాంగ్రెస్, సీపీఎం నేతలు అడ్డుకున్నారు.
నరసాపురం ప్రభుత్వాసుపత్రి ప్రధాన ద్వారం వద్ద వైసిపి, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు మంత్రులు పీతల సుజాత, అయ్యన్నపాత్రుడు, మణిక్యాలరావులు మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్లిన విషయం తెలిసిందే.
అయితే నిరసనకారులు మంత్రులను అడ్డుకున్నారు. కుటుంబ సభ్యుల సమక్షంలో మృతదేహాలకు పంచనామా జరిపి శవపరీక్ష చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, అక్వా పరిశ్రమ ప్రమాద ఘటనలో అయిదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే.
మొగల్తూరులో ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్లో ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విష వాయు పీల్చి మృత్యువాత పడిన అయిదుగురు యువకుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఒక్కో కుటుంబానికి రూ.17లక్షల పరిహారాన్ని ప్రకటించారు.
ఈ దుర్ఘటనపై సమాచారం అందిన వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్తో ఫోన్లో సంప్రదించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఘటనా స్థలానికి వెళ్లాలని అక్కడి ఎమ్మెల్యేను ఆదేశించారు. అనంతరం దీనిపై సమీక్షించిన ముఖ్యమంత్రి ముగ్గురు మంత్రులను ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు.